NOMINATED POSTS: నామినేటేడ్‌ పదవుల కేటాయింపుపై అసంతృప్తి

పున:పరిశీలన యోచనలో పీసీసీ

Update: 2024-05-21 04:00 GMT

ప్రభుత్వంలో నామినేటెడ్‌ పదవుల భర్తీపై PCC కసరత్తు కొనసాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసినవారు...అసెంబ్లీ, పార్లమెంట్‌ఎన్నికల్లో పార్టీకోసం పనిచేసిన నాయకులకి పదవులుకట్టబెట్టేదిశలో రాష్ట్ర నాయకత్వం ముందుకెళ్తోంది. నేతల ప్రతిభకి అనుగుణంగా ఆయారంగాల కార్పోరేషన్లకి ఛైర్మన్లగా నియమించేందుకు కావాల్సిన అన్నిఅంశాలుపరిగణనలోకి తీసుకుంటున్నట్లు PCC వర్గాలు చెబుతున్నాయి. 

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో పార్టీకోసం కీలకంగా పనిచేసిన నాయకులకు నామినేటెడ్‌ పోస్టులివ్వాలని రాష్ట్రనాయకత్వం నిర్ణయించింది. పదేళ్లుగా అధికారంలో లేకున్నా పార్టీని అంటిపెట్టుకున్న కార్యకర్తలు, నేతలు ఛైర్మన్‌ పదవులు ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 37 మందికి కార్పోరేషన్‌ పదవులను... హస్తంపార్టీ ప్రకటించింది.వెంటనే పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వారు పదవీబాధ్యతలు చేపట్టలేదు. ఆ 37 మందిలో కొందరికి కేటాయించిన నామినేటెడ్‌ పదవులపై పార్టీ నాయకత్వం సంతృప్తిగాలేనట్లు తెలుస్తోంది. పార్టీకి సేవలు చేసిన దాఖలాలు లేని వారికి పదవులిచ్చారంటూ కొందరు పీసీసీపై తీవ్ర ఒత్తడి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేటాయిస్తామని వారికి సర్దిచెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికలు పూర్తికావడంతోపార్టీ నాయకత్వంపై ఆశావహులు ఒత్తిడి పెంచే పనిలో పడ్డారు.తొలిజాబితాలోని 37 మందితోపాటు తమకూ పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వచ్చేనెల 6వరకు ఎన్నికలకోడ్‌ అమల్లోఉన్నావిద్య, వ్యవసాయ రంగాలకు చెందిన ఛైర్మన్లు బాధ్యతలు చేపట్టడం ద్వారా విద్యార్ధులు, వ్యవసాయ కార్యకలాపాల ప్రయోజనాలు నెరవేరతాయని రాష్ట్ర నాయకత్వం భావించింది. ఎన్నికల కమిషన్‌ అనుమతితో ఆయా ఛైర్మన్లను బాధ్యతలు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ తరుణంలో కొత్తగా..... నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న నాయకులంతా అంతా ఒకేసారి బాధ్యతలు తీసుకునేట్లు చూడాలని కోరారు. అలా జరగకుంటే పార్టీకి పార్టీ కోసం సేవచేసినా పదవులు రాలేదన్నప్రచారం తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుందని కొందరు నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా తాత్కాలికంగా 37 నామినేటెడ్‌ పదవుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆగినట్లు విశ్వసనీయసమాచారం. కొత్తగా విద్య, వ్యవసాయకమిషన్లతోపాటు ఉన్నత విద్యా కార్పోరేషన్‌, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌, ఆర్టీసీ ఇలా మరో 20కిపైగా నామినేటెడ్‌ పోస్టులను అర్హులైన నాయకులతో భర్తీ చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

పార్లమెంట్‌ఎన్నికల నియమావళి వస్తుందని హడావుడిగా ఎంపిక చేసిన 37 నామినేటెడ్‌ పోస్టుల భర్తీని పున:పరిశీలన చేయాలని పీసీసీ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా నామినేటెడ్‌ పోస్టులు ఆశిస్తున్న వారివిద్యార్హత, ఆయా రంగాల్లో ఉన్నఅనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా వారికిచ్చే పదవులకు న్యాయం చేయడం సహా సర్కారికిప్రయోజనం కలుగుతుందని అంచనావేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్ ముగిసేలోగా కసరత్తు పూర్తిచేసి జాబితాను సిద్దం చేసుకోవాలని పీసీసీ భావిస్తోంది. అర్హతలు, అనుభవాల విషయంలో ఇప్పటికే ప్రకటించిన ఛైర్మన్ల పదవులను పరిగణనలోకి తీసుకుంటారా....లేక ఇప్పుడు కొత్తగా ప్రకటించనున్న పదవులకే వర్తింపచేస్తారా అన్న విషయమై స్పష్టతలేదు.  

Tags:    

Similar News