నగరంలోని యాకుత్పురాలో విషాదం నెలకొంది. ఇంట్లో బాణసంచా పేలి ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వీరి కుమార్తెకు తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం మలక్పేటలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కూతురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే ఈ దంపతులిద్దరూ దీపావళి పండుగ నేపథ్యంలో స్థానికంగా పటాకుల దుకాణం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో పటాకుల నిల్వలను ఉంచారు. రాత్రి ఇంట్లో పిండి వంటలు చేస్తుండగా.. నిప్పు రవ్వలు ఎగిరిపడి, బాణసంచాకు అంటుకున్నాయి. దీంతో మంటలు ఎగిసిపడడంతో, మంటల్లో చిక్కుకుని దంపతులు ఉషాబాయి, మోహన్ లాల్ ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.