Weather Report: పెరుగుతోన్న చలి తీవ్రత...
మరోసారి ఎల్లో అలెర్ట్ జారీ చేయనున్న వాతావరణ శాఖ; శుక్రవారం నుంచి కనిష్ఠ స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు..
నగరం మరోసారి చలికి గజగజ వణకబోతోంది. కోల్డ్ వేవ్ మరోసారి ఉధృతంగా మారడంతో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ లో శుక్రవారం నుంచి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవ్వనున్నాయి. కనిష్ఠంగా 11 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోనున్నాయని తెలుస్తోంది. చార్మినార్, ఖైర్తాబాద్, ఎల్బీనగర్, సికింద్రాబాద్, సెరిలింగంపల్లి జోన్లలో ఫిబ్రవరి 3-4 మధ్య తీవ్రమైన చలిగాాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో తెల్లవారుఝామున అక్కడక్కడా చిరుజల్లులు పడే అవకాశం కూడా ఉందని స్పష్టం చేసింది. ఈ సీతాకాలం అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైన సంగతి తెలిసిందే. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 6.5 డిగ్రీల కనిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత పెరిగిన సంగతి తెలిసిందే. అయితే చలి ఎంత తీవ్రంగా ఉందో అదే స్థాయిలో వేసవిలో ఎండలు మండే ఛాన్స్ కూడా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్ నినో వల్ల ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయికి చేరుకోనున్నాయని వెల్లడించింది. అంతేకాదు దీని వల్ల వర్షాభావ పరిస్థితులు సైతం నెలకొనున్నాయని తెలుస్తోంది.