హుజూరాబాద్లో దుమారం రేపుతున్న వాట్సాప్ చాటింగ్..!
ఈటల రాజేందర్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మరికొంత మంది దళిత సంఘాలు ధర్నాకు దిగి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి.. దళితబంధు పథకంపై ఎస్సీలను కించపరిచేలా వాట్సాప్ చాటింగ్ చేశారంటూ సోషల్ మీడియాలో చాటింగ్ స్కీన్ షాట్స్ వైరల్ కావడంతో.. దళిత సంఘా ఆందోళనకు దిగాయి.
మరోవైపు ఈటల రాజేందర్ను నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేకే.. అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మరికొంత మంది దళిత సంఘాలు ధర్నాకు దిగి సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. దీనితో పాటు ఈటల సతీమణి జమున అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఈటల జమున ధర్నాకు దిగారు. అబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన జమున.. పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈటలను ఎదుర్కోలేకే టీఆర్ఎస్ నాయకులు ఫేక్ వార్తలు సృష్టించి ప్రచారం చేస్తున్నారని ఈటల జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై తమకు అపారమైన గౌరవం ఉందన్న ఆమె.. వారిని ప్రేమగా చూసేవాళ్లమని పేర్కొన్నారు. ఇవన్నీ కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు పన్నిన కుట్రని.. వారిని వెంటనే గుర్తించి బయటకు తీసుకు రావాలని డిమాండ్ చేశారు. దళిత బంధు హుజురాబాద్తో పాటు రాష్ట్ర మంతా ఇవ్వాలని ఈటల జమున డిమాండ్ చేశారు.