ఫార్ములా-ఈ రేసుకు సంబంధించి ఏసీబీ కేసును క్వాష్ చేయాలన్న కేటీఆర్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. మరోవైపు ఈనెల 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన విచారణకు హాజరవుతారా? ఆయనను అధికారులు అరెస్ట్ చేస్తారా? అనేది జనాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు అరెస్టుపై స్టే కూడా ఎత్తేసింది. చట్టప్రకారం నడుచుకోవాలని సూచించింది. అటు నందినగర్లోని కేటీఆర్ ఇంటికి హరీశ్ రావు, కవిత చేరుకున్నారు. లీగల్ టీమ్తో వీరు ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో భవిష్యత్ కార్యాచరణ ఏంటని సమాలోచనలు చేస్తున్నారు.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. విచారణే వద్దన్న కేటీఆర్ కోర్టుకు ఎలా వెళ్లారు? అని ప్రశ్నించారు. దొంగతనం చేయలేదని నిరూపించుకోవడానికి యత్నాలా అని నిలదీశారు. దొంగలకు కోర్టు అండగా ఉండదని చెప్పడానికి ఇదే నిదర్శనం అని దయాకర్ అన్నారు. మానవ హక్కుల పరిరక్షణకే కోర్టులున్నాయని తెలిపారు