Medigadda project: మేడిగడ్డపై మధ్యంతర నివేదిక
21 మంది ఇంజనీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్లు వార్తలు... అనేక లోపాలు ఉన్నట్లు వెల్లడి..!;
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తన మధ్యంతర నివేదికను న్యాయ విచారణ కమిషన్కు అందజేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. నివేదికలో 21 మంది ఇంజినీర్లను బాధ్యులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో నిర్మించారు మేడిగడ్డ బ్యారేజ్. ఎన్నికలకు ముందు ఈ ప్రాజెక్టు కుంగింది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీంతో డీజీగా ఉన్న రాజీవ్రతన్ బ్యారేజ్కు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మేడిగడ్డతో సంబంధం ఉన్న ఇంజనీర్లను పిలిచి విచారించారు. ఈ విచారణలో అనేక అంశాలపై లోపాలు బయటపడ్డాయి. ఆ తర్వాత విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో నివేదికను తమకు అందజేయాలని జస్టిస్ పీసీ ఘోస్ కమిటీ, విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఆ సమయంలో డీజీగా ఉన్న రాజీవ్రతన్ బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించడంతోపాటు రికార్డులన్నీ స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేశారు. మేడిగడ్డతో సంబంధమున్న ఇంజినీర్లందర్నీ విచారణకు పిలిపించి, వివరాలను సేకరించారు. నాణ్యత లేమి, డిజైన్లో లోపాలు, పని ముగియకుండానే పూర్తయినట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వడం, పెరిగిన వ్యయం, నిర్వహణ లోపం, పని చేయని క్వాలిటీ కంట్రోల్ ఇలా... అనేక అంశాలపై దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించారు.
ఆయన మరణం అనంతరం విజిలెన్స్ దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రభుత్వానికి నివేదిక అందజేయలేదు. తమకు నివేదికను అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్... విజిలెన్స్ విభాగాన్ని ఆదేశించారు. ఇటీవల విజిలెన్స్ డీజీగా అదనపు బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ మధ్యంతర నివేదికను రూపొందించి సోమవారం కమిషన్కు సమర్పించారు. ఇందులో 21 మంది ఇంజినీర్ల పాత్రను గుర్తించి, ఎవరి ప్రమేయం ఏంటన్నది వివరంగా పేర్కొన్నట్లు తెలిసింది.
ప్రాణహిత-చేవెళ్ల పునరాకృతి, కాళేశ్వరం ఎత్తిపోతల, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సమయంలో తీసుకొన్న నిర్ణయాలు, మీటింగ్ మినిట్స్ను సమగ్రంగా పొందుపరచినట్లు సమాచారం. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికను ఇవ్వాలని, తుది నివేదికను సమర్పించాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ ఘోష్ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. విజిలెన్స్ తుది నివేదిక కోసం నీటిపారుదల శాఖ కార్యదర్శికి, సీఎంవోకు కూడా జస్టిస్ పీసీ ఘోష్ లేఖ రాసినట్లు తెలిసింది.