గుంతల రోడ్లను స్వచ్ఛందంగా పూడుస్తున్న వృద్ధ దంపతులు.. కారు బహుమతిగా ఇచ్చిన అమితాబ్.!
రోడ్లకు గుంతలు పడటం, వాటిపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడటం నిత్యం జరుగుతూనే ఉన్నాయి.;
రోడ్ల పైన గుంతలు పడటం, వాటిపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రమాదాల బారిన పడటం నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అయినా అధికారులు కానీ, రాజకీయ నేతలు కానీ వాటిని పట్టించుకోరు. ప్రజలు కూడా గుంతల రోడ్లను చూసీ చూడనట్లు వదిలేసి.. అవే రోడ్లపై అవస్థలు పడుతూ ప్రయాణిస్తుంటారు. కానీ ఓ70 ఏళ్ల వృద్ధ జంట అందరిలా అనుకోలేదు. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, ప్రమాదాలను చూసి చలించిపోయిన ఆ జంట.. గుంతలను పూడ్చుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
2010 నుంచి గంగాధర్ తిలక్, వెంకటేశ్వరీ దంపతులు ఓ కారులో రోడ్ బ్రాండ్ మెటీరియల్ తీసుకొని వెళ్లి గుంతలను పూడుస్తున్నారు. తమ కారుకు పాత్హోల్ అంబులెన్స్ అని పేరు కూడా పెట్టారు. గుంత కనిపిస్తే కారు ఆపి దానిని పూడ్చేస్తారు. ఇప్పటి వరకూ దాదాపు 2030 గుంతలను తిలక్ దంపతులు పూడ్చారు. ఒక్కోగుంత పూడ్చడానికి 2వేల రూపాయల వరకూ ఖర్చు అవుతోంది. తన ఫించన్ డబ్బులనే ఉపయోగించి తిలక్ స్వచ్ఛందంగా ఈ పని చేస్తున్నారు. తిలక్ చేస్తున్న సామాజిక సేవకు మెచ్చి బిగ్బి అమితాబ్ ఓ కారును వారికి బహుమతిగా ఇచ్చారు.