Viral : కుక్కల భయంతో ఇంటి మీదకు ఎక్కిన ఎద్దు.. ఆదిలాబాద్ జిల్లాలో ఆసక్తికర ఘటన..
మన ప్రాణం కాపాడుకోవడానికి ఎంతటి సాహసానికి అయినా వెనకాడం. మనం ఏం చేస్తున్నాం...ఎక్కడున్నాం అనే విషయాలను కూడా పట్టించుకోము...మనుషులే కాదు...జంతువులు కూడా దీనికి అతీతం కాదు అని నిరూపించింది ఈ ఘటన. కుక్కల దాడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ ఎద్దు చేసిన సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
భోరజ్ మండలం నిరాల గ్రామానికి చెందిన రైతు షేక్ గఫూర్ తన ఎద్దును ఇంటి బయట కట్టాడు. అదే సమయంలో కొన్ని వీధి కుక్కలు గుంపుగా వచ్చి ఆ ఎద్దుపై దాడికి ప్రయత్నించాయి. దీంతో భయపడిన ఎద్దు, ప్రాణభయంతో కట్టు తాళ్లను తెంచుకుని పరుగు లంకించుకుంది. అలా పరుగెడుతూ పక్కనే ఉన్న రాళ్ల కుప్పపైకి ఎక్కి, అక్కడి నుంచి నేరుగా ఓ ఇంటి పైకప్పు మీదకు చేరి తన ప్రాణాలు కాపాడుకుంది.
ఇంటిపై ఎద్దును చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా నివ్వెరపోయారు. తాళ్ళ సహాయంతో చాలా సేపు శ్రమించి ఎద్దును కిందకు దించారు. పై కప్పు మీదకు ఎక్కడంతో ఇంటికి స్వల్ప నష్టం వాటిల్లింది. ఈ ఘటనను చూసిన స్థానికులు తమ ఫోన్లలో వీడియోలు తియ్యగా...ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.