హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చిందన్న ఆమె.. అసలు ఆ ఇంట్లో తాము నివాసమే ఉండటం లేదని పేర్కొంది. అలాంటప్పుడు అంత బిల్లు ఎలా వస్తుందంటూ ఫైర్ అయ్యింది. ఈ మేరకు మండిలో జరిగిన ఓ కార్యక్రమంలో కంగనా మాట్లాడుతూ ‘మనాలీలో ఉన్న నా ఇంటికి ఈ నెల రూ.లక్ష కరెంట్ బిల్లు వచ్చింది. నేను నివసించని ఇంటికి ఈ రేంజ్ లో వచ్చిన బిల్లు చూసి షాకయ్యా. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వ చర్యకు సిగ్గుపడుతున్నాను. అయినప్పటికీ మనందరికీ ఒక అవకాశం ఉంది. నా సోదరీ సోదరులను నేను కోరేది ఒక్కటే. ఇలాంటి సమస్యలపై మనమంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. దేశాన్ని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ తోడేళ్ల చెర నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం' పిలుపునిచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కంగనా చివరగా నటించిన చిత్రం ఎమర్జెన్సీ. ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించడంతో పాటు తొలిసారి దర్శకురాలి అవతారమెత్తింది. అంతేకాక తన సినిమాను తనే నిర్మించింది. ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో విధించిన ఎమర్జెన్సీ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద రాణించలేకపోయిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది.