అమెరికా వీసా కోసం ఇకపై నెలల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. నిబంధనల్లో మార్పులు చేయడంతో కొత్త సంవత్సరం నుంచి దరఖాస్తుదారులు వారి అపాయింట్మెంట్ను ఎలాంటి అదనపు రుసుము లేకుండా మరో వీసా కేంద్రానికి మార్చుకోవడంతో పాటు ఒకసారి రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. రెండోసారి రీ షెడ్యూల్ చేసుకోవాలని భావిస్తే కొత్త అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు భారత్లోని యూఎస్ ఎంబసీ ప్రకటన విడుదల చేసింది.
‘‘ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా వీసా ఇంటర్వ్యూ అపాయింట్మెంట్లు కల్పించాలి. వెయిటింగ్ సమయాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో నిబంధనల్లో కొన్ని మార్పులు చేస్తున్నాం. జనవరి 1, 2025 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. నాన్ఇమ్మిగ్రెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు మీకు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ కు తొలి షెడ్యూల్చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే.. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఒకసారి షెడ్యూల్ను మార్చుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీరు అపాయింట్మెంట్ను మిస్ అయినా.. లేదా రెండోసారి రీషెడ్యూల్ చేసుకోవాలనుకున్నా.. కొత్త అపాయింట్మెంట్ కింద బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మీరు మళ్లీ అప్లికేషన్ రుసుము చెల్లించాలి’’ అని ఎంబసీ ఓ ప్రకటనలో వెల్లడించింది.