భారత్ కాస్త అదుపులో ఉన్న కరోనా.. అమెరికాలో చూస్తే..
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 85 లక్షలకు చేరుకోగా.. వీరిలో 2 లక్షల 24వేల మంది మృత్యవాతపడ్డారు..
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే మొత్తం కేసుల సంఖ్య 85 లక్షలకు చేరుకోగా.. వీరిలో 2 లక్షల 24వేల మంది మృత్యవాతపడ్డారు. ఇక జులై 16న అత్యధికంగా ఒక్కరోజే 77వేల 632 కేసులు నమోదయ్యాయి. మూడు నెలల తర్వాత తాజాగా ఒక రోజు వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 83వేల 757 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా కనెక్టికట్ రాష్ట్రంతో పాటు సమీప ప్రాంతాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది.
అధిక జనసాంద్రత, జనాభా కలిగిన భారత్ వంటి దేశాల్లో కరోనా వైరస్ కాస్త అదుపులోకి వచ్చినట్టు కనిపిస్తోంది. కానీ, అమెరికాలో మాత్రం ఇలాంటి పరిస్థితులు కనిపించడంలేదు. హాస్పిటళ్లు నిండిపోవడంతో సియాటెల్, పోర్ట్లాండ్, ఒరేగన్ ప్రాంతాలకు రోగులను ఎయిర్లిఫ్ట్ ద్వారా తరలిస్తున్నారు. మరికొన్ని హాస్పిటళ్లలో చిన్నారులు మినహా ఎవ్వరినీ చేర్చుకోవడం లేదు. ఆయా రాష్ట్రాల గవర్నర్లు ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. కరోనా వైరస్ బారినపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మాస్కు ధరించకుండా తిరిగే వారికి టీకా వేయబోమని ఉతాహ్ రాష్ట్ర గవర్నర్ గ్యారీ హెర్బర్ట్ ప్రకటించారు. ప్రజలు మాస్కులు ధరించకుండా నిర్లక్ష్యం వహిస్తే.... రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా చేతులెత్తేయాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు. చాలాప్రాంతాల్లో అధికారుల సూచనలను ప్రజలను పట్టించుకోవడం లేదని.. వైరస్ ఉద్ధృతి అదుపులోకి రావడంలేదని అక్కడి నిపుణులు పేర్కొంటున్నారు.
అమెరికాలో పరిస్థితి చూస్తుంటే యూరప్లో విజృంభించిన మాదిరిగానే కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ డకోటా, ఉతాహ్, ఇదాహో రాష్ట్రాలు వైరస్ ధాటికి వణికిపోతున్నాయి. అమెరికాలో కొన్ని రోజులుగా వారంలో సగటు కేసుల సంఖ్య 44 వేలు ఉండగా ప్రస్తుతం అది 61వేలకు పెరగడం పరిస్థితి అద్దం పడుతోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు పలుచోట్ల ప్రజల నుంచి మద్దతు కరవవుతోంది. మాస్కులు, భౌతికదూరం, లాక్డౌన్ ఆంక్షలపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలు కూడా వైరస్ తీవ్రతపై ప్రభావం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటించకుండానే ఎన్నికల ప్రచార సభల్లో ప్రజలు కనిపిస్తున్నారు.