Chinmoy Krishnadas: చిన్మయ్ కృష్ణదాస్పై బంగ్లాదేశ్లో మరో కేసు
హెఫాజాత్-ఎ-ఇస్లాం కార్యకర్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు;
ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ను బంగ్లాదేశ్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆయనపై తాజాగా మరో కేసు నమోదు చేసినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ మద్దతుదారులు, పోలీసులకు మధ్య గొడవ నెలకొనడంతో కృష్ణదాస్ సహా 164 మందిపై దేశద్రోహం కేసు నమోదుచేసినట్లు సమాచారం. హెఫాజాత్-ఎ-ఇస్లాం బంగ్లాదేశ్ కార్యకర్త, వ్యాపారవేత్త ఇనాముల్ హక్ ఫిర్యాదు మేరకు మరో 400-500 మంది గుర్తుతెలియని వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
నవంబర్ 26న చిట్టగాంగ్ కోర్టు ప్రాంగణంలో సంప్రదాయ దుస్తులు ధరించినందుకు కృష్ణదాస్ అనుచరులు తనపై దాడి చేసినట్లు ఇనాముల్ హక్ ఆరోపించారు. దాడిలో తన కుడి చేయి, తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని.. అందుకే ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు డిసెంబర్ 3న ఓ సినిమా హాలు వద్ద ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యకర్తలు ఇస్కాన్ సభ్యులపై దాడికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఓ వ్యాపారవేత్త మరో ఫిర్యాదు చేశారు.
బంగ్లాదేశ్లో ఇస్కాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్న చిన్మయ్ కృష్ణదాస్ గత నెలలో అక్కడ జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఈక్రమంలో బంగ్లాదేశ్ జెండాను ఉద్దేశించి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢాకా విమానాశ్రయంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈనేపథ్యంలో చెలరేగిన ఘర్షణల్లో ఓ న్యాయవాది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అంతర్జాతీయ శ్రీకృష్ణ సమాజం (ఇస్కాన్) కార్యకలాపాలపై నిషేధం విధించాలని ఓ న్యాయవాది పిటిషన్ వేయగా.. బంగ్లా హైకోర్టు దానిని కొట్టివేసింది. అయితే కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్పై వాదనలు వినిపించేందుకు వచ్చిన లాయర్లపై అక్కడి వారు దాడులకు పాల్పడుతుండడంతో న్యాయవాదులు ఎవరూ ముందుకురావట్లేదు. దీంతో బంగ్లాదేశ్, భారత్ల మధ్య ఉన్న సంబంధాలు మరింత క్షీణిస్తున్నాయి.