Colombia: కొలంబియా అధ్యక్ష అభ్యర్థిపై హత్యాయత్నం
దాడిని తీవ్రంగా ఖండించిన కొలంబియా అధ్యక్ష కార్యాలయం;
కొలంబియా సెనేటర్, 2026 అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి అయిన మిగెల్ ఉరిబే (39)పై శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని బొగోటాలోని ఫాంటిబన్ ప్రాంతంలో ఒక పబ్లిక్ పార్కులో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుందని అధికార వర్గాలు తెలిపాయి.
స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మిగెల్ ఉరిబే తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో సాయుధ వ్యక్తులు ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉరిబే ప్రసంగానికి అంతరాయం కలిగిస్తూ తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించడం ఆ వీడియోలో స్పష్టంగా ఉంది. మరో చిత్రంలో, ఉరిబే రక్తపు మడుగులో ఒక తెల్ల కారు బానెట్పై పడిపోయి ఉండగా, ప్రజలు ఆయనకు సాయం అందించేందుకు పరుగెత్తడం కనిపించింది.
ఒక తూటా సెనేటర్ మెడ లేదా తల భాగంలోకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే ఆయనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎటువంటి సమాచారం వెలువడలేదు.
ఈ కాల్పుల ఘటనకు సంబంధించి 15 ఏళ్ల బాలుడిని అరెస్టు చేసినట్లు కొలంబియా రక్షణ మంత్రి పెడ్రో సాంచెజ్ ప్రకటించారు. ఈ దాడిలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ఉరిబే చికిత్స పొందుతున్న ఆసుపత్రిని తాను సందర్శించినట్లు మంత్రి పేర్కొన్నారు.ఈ హింసాత్మక దాడిని కొలంబియా అధ్యక్ష కార్యాలయం తీవ్రంగా ఖండించింది. కాల్పుల ఘటనకు దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
మిగెల్ ఉరిబే కొలంబియాలో సుప్రసిద్ధ రాజకీయ నాయకుడు. ఆయన కుటుంబానికి దేశంలోని లిబరల్ పార్టీతో చారిత్రక సంబంధాలున్నాయి. ఆయన తండ్రి ఒక వ్యాపారవేత్త, కార్మిక సంఘ నాయకుడు కాగా, తల్లి డయానా టర్బే ఒక జర్నలిస్ట్. 1990లో డయానా టర్బేను అపహరించారు. అప్పట్లో డ్రగ్ మాఫియా డాన్ పాబ్లో ఎస్కోబార్ నియంత్రణలోని సాయుధ ముఠా ఈ అపహరణకు పాల్పడింది. దురదృష్టవశాత్తు, ఒక రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
మిగెల్ ఉరిబే ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ సెంటర్ పార్టీని కొలంబియా మాజీ అధ్యక్షుడు అల్వారో ఉరిబే స్థాపించారు. ఈ దాడి తీవ్రమైనదని ఆ పార్టీ పేర్కొంది. అయితే సెనేటర్ ఆరోగ్య పరిస్థితిపై అదనపు సమాచారం విడుదల చేయడానికి నిరాకరించింది. దేశ అధ్యక్షుడు గుస్తావో పెట్రో, ఉరిబే కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేశారు. "మీ బాధను ఎలా తగ్గించాలో నాకు తెలియదు. ఇది ఒక తల్లిని కోల్పోయిన బాధ, ఒక మాతృభూమి బాధ" అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన సందేశంలో రాశారు.
కొలంబియాలో వామపక్ష గెరిల్లాలు, పారామిలిటరీ గ్రూపుల నుంచి వచ్చిన క్రిమినల్ ముఠాలు, ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణల కారణంగా చాలా కాలంగా హింస కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజా ఘటన దేశంలో నెలకొన్న అశాంతికి అద్దం పడుతోంది.