కరోనా మహమ్మారీతో విలవిల్లాడుతున్న అమెరికా.. ఊపిరి పీల్చుకోనుంది. కరోనా వాక్సిన్కు ఆ దేశం సిద్ధమైంది. సోమవారం ఫైజర్ తొలి టీకా డోసులను అమెరికా ప్రజలు తీసుకోనున్నారు. అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన పైజర్ వ్యాక్సిన్ రవాణా నిన్న ప్రారంభమైంది. మిషిగన్ లోని ఫైజర్ అతిపెద్ద కర్మాగారం నుంచి ఫెడెక్స్ ట్రక్కులు బయల్దేరాయి. ఇవి 145 వాక్సిన్ సరఫరా కేంద్రాలకు వ్యాక్సిన్ను సరక్షితంగా అందజేయనున్నాయి.
వాక్సిన్ను మైనస్ 94 డీగ్రీల ఉష్ణోగ్రతలోనే భద్ర పరచాలి. ఇందుకు తగ్గట్టు ఫైజర్ ఏర్పాట్లు చేసింది. వాక్సిన్ బాక్సుల్లో జీపీఎస్ పరికరాలను కూడా అమర్చింది. వీటితో ఎప్పటికప్పుడు ఉష్ణోగ్రతలను పర్యవేక్షిస్తున్నారు. తొలి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసులను పంపిణీ చేస్తారు. వీటిని ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ యూనిట్స్లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి, నర్సింగ్ హోంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఇస్తారు. తర్వాత మళ్లీ మూడూ వారాలకు వీరందరికి రెండో డోస్ సరఫరా చేస్తారు.