ట్రంప్ క్యాబినెట్లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామికి కీలక పదవులు
వర్నమెంట్ ఆఫ్ ఎఫిషియెన్సీ డిపార్ట్మెంట్ లోనే ఇద్దరకీ కీలక బాధ్యతలు;
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. తన పాలనా యంత్రాంగంలో పదవుల నియమాకం ఇప్పటికే ప్రారంభించారు. ఎన్నికల సమయంలో తనకు మద్దతుగా నిలిచిన టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు సముచిత స్థానం కల్పిస్తున్నట్టు వెల్లడించారు. మస్క్ ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’కి నాయకత్వం వహిస్తారని ట్రంప్ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో దీనిపై ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ఈ విభాగానికి మస్క్తో పాటు భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి హెడ్గా ఉంటారని చెప్పారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన విడుదల చేశారు.
‘‘అద్భుతమైన ఈ ఇద్దరు అమెరికన్లు కలిసి మా ప్రభుత్వంలో బ్యూరోక్రసీకి మార్గం చూపుతారు. ‘సేవ్ అమెరికా’ ఉద్యమానికి ముఖ్యమైన ఉద్యోగులపై అదనపు నిబంధనల భారం సడలింపు, వృథా వ్యయాల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి మార్పులు చేపడతారు’’ అని ట్రంప్ వెల్లడించారు.
కాగా గతవారం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారీస్పై రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఘనవిజయం సాధించారు. ట్రంప్ కోసం మస్క్ చాలా కష్టపడ్డారు. భారీగా విరాళాలు అందించడమే కాకుండా ట్రంప్తో కలిసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఫలితాలు వెలువడిన తర్వాత ‘విక్టరీ స్పీచ్’లో ఎలాన్ మస్క్పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన వ్యక్తి, మేధావి అని అభివర్ణించారు. ‘‘మనకో కొత్త నక్షత్రం ఉంది. ఆ నక్షత్రమే ఎలాన్ మస్క్’’ అని అన్నారు. రెండు వారాలపాటు విస్తృతంగా ప్రచారంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. తనతో కలిసి ఆయన ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాలో ప్రచారం నిర్వహించారని గుర్తుచేశారు. ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్కు ఎలాన్ మస్క్ పూర్తిస్థాయి మద్దతు ప్రకటించి, ఆయన ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు, విరాళంగా 100 మిలియన్ డాలర్లు అందజేశారు. సోషల్ మీడియాలో ట్రంప్ మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు.