Forbes 2023 Richest Women: ఫోర్బ్స్ లో సత్తా చాటిన భారతీయ మహిళలు
వందమంది మహిళా సంపన్నుల జాబితాలో.. నలుగురు భారతీయ-అమెరికన్ లు
అమెరికాలో స్వయంకృషితో వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఆ జాబితాలో నలుగురు భారత సంతతి మహిళలు చోటు సంపాదించుకున్నారు. భారతీయులు, భారత సంతతి వ్యక్తుల శక్తిసామర్థ్యాలు అంతర్జాతీయంగా మరోసారి నిరూపించారు. భారతీయ-అమెరికన్ వనితలు జయశ్రీ ఉల్లాల్, నీర్జా సేథి, నేహా నార్ఖేడే, ఇంద్రా నూయి ఈ కీర్తి గడించారు. ఈ నలుగురి నికర విలువ కలిపి $4 బిలియన్ల కంటే ఎక్కువ. వ్యక్తిగత ఆస్తుల విలువ, ఆయా కంపెనీల్లో వాటాల విలువ ఆధారంగా ఫోర్బ్స్ ఈ జాబితాను వెల్లడించింది.
జయశ్రీ ఉల్లాల్:
అరిస్టా నెట్ వర్క్ కు ప్రెసిడెంట్, సీఈవోగా వ్యవహరిస్తున్న 62 ఏళ్ల జయశ్రీ ఉల్లాల్ ఫోర్బ్స్ జాబితాలో 15వ స్థానంలో నిలిచారు. ఆమె నాయకత్వంలోని అరిస్టా నెట్ వర్క్ ట్రేడింగ్ కంపెనీ ఆదాయం గతేడాది 4.4 బిలియన్ డాలర్లు. ఆరిస్టాలో జయశ్రీకి 2.4 శాతం వాటా ఉంది. క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ స్నో ఫ్లేక్ బోర్డ్ డైరెక్టర్ గానూ ఆమె కొనసాగుతున్నారు.
నీరజా సేథీ:
68 ఏళ్ల నీరజా సేథీ ఫోర్బ్స్ జాబితాలో 25వ స్థానంలో ఉన్నారు. భర్త భరత్ దేశాయ్ తో కలిసి ఆమె 1980లో సింటెల్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థను 2018లో ఫ్రెంచ్ ఐటీ సంస్థ అటోస్ ఎస్ఈ 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. నీరజా సేథీ మొత్తం నికర ఆస్తి విలువ 990 మిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ పేర్కొంది.
నేహా నార్ఖెడే:
38 ఏళ్ల నేహా నార్ఖెడే విషయానికొస్తే ఈమె ఫోర్బ్స్ జాబితాలో 50వ స్థానం దక్కించుకున్నారు. నికర ఆస్తి విలువ 520 మిలియన్ డాలర్లు. గతం లో లింక్డ్ ఇన్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా ఉన్న నేహా ఓపెన్ సోర్స్ మెసేజింగ్ వ్యవస్థ అపాచే కాఫ్కా రూపకల్పనలో పాలుపంచుకున్నారు. 2023లో సొంతంగా ఆసిలార్ అనే సంస్థను ప్రారంభించారు. ఈ టెక్ కంపెనీకి ఆమె సహవ్యవస్థాపకురాలు, సీఈవో.
ఇంద్రనూయి:
ఇంద్రనూయి పెప్సీకో సంస్థ మాజీ సీఈవో. 67 ఏళ్ల ఇంద్రనూయి 2019లో పదవీవిరమణ చేశారు. అనంతరం అమెజాన్ తో కలిసి పని చేస్తున్నారు. తాజా ఫోర్బ్స్ జాబితాలో ఆమె ర్యాంకు 77. ఇంద్రనూయి నికర ఆస్తి విలువను ఫోర్బ్స్ 350 మిలియన్ డాలర్లుగా పేర్కొంది.
ఈ జాబితాలో ఏబీసీ సప్లై సంస్థ సహ వ్యవస్థాపకురాలు డైనే హెండ్రిక్స్ వరుసగా ఆరో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచారు. 76 ఏళ్ల హెండ్రిక్స్ నికర ఆస్తి విలువ 15 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్స్ వెల్లడించింది.