పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బంగారు గని కుప్పకూలి 42 మంది సజీవ సమాధి అయ్యారు. కెనైబా జిల్లాలోని దబియా ప్రాంతంలో ఉన్న బిలాలీకొటోలో ఈ ఘటన జరిగింది. చైనా దేశస్తుల ఆధీనంలో ఉన్న బంగారు గనిలో మట్టిచరియలు విరిగి పడటంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఒక్కసారిగా గనిలో చాలాభాగం కుప్పకూలి పోయింది. అయితే 42 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అనేక మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బంగారం వెలికితీసేందుకు వెళ్లిన వందల మంది కార్మికులు ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. అలర్ట్ అయిన రెస్క్యూ సిబ్బంది.. స్పాట్కు చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం చోటుచేసుకున్న గనికి అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. నెల రోజుల వ్యవధిలో ఆఫ్రికాలో చోటు చేసుకున్న రెండో అతి పెద్ద ప్రమాదం ఇది.