Chinmoy Das : బంగ్లాదేశ్ హిందూ నేత చిన్మోయ్ కృష్ణ దాస్కు బెయిల్ మంజూరు
ఆరు నెలల తర్వాత బెయిల్;
బంగ్లాదేశ్లో ప్రముఖ హిందూ నేత, బంగ్లాదేశ్ సమ్మిలితో సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధి చిన్మోయ్ కృష్ణ దాస్కు ఊరట లభించింది. ఆయనపై నమోదైన దేశద్రోహం ఆరోపణల కేసులో ఢాకా హైకోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ అతోర్ రెహమాన్, జస్టిస్ అలీ రెజాలతో కూడిన ధర్మాసనం తుది విచారణ అనంతరం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
గతేడాది నవంబర్ 25న ఢాకాలోని హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దేశద్రోహం ఆరోపణలపై పోలీసులు చిన్మోయ్ కృష్ణ దాస్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఆయన విడుదల కోసం పలు హిందూ సంఘాలు, అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేశాయి. చిన్మోయ్ కృష్ణ దాస్ బంగ్లాదేశ్ జాతీయ హిందూ మహజోత్ (BJHM), ఇస్కాన్ (ISKCON) వంటి సంస్థలతోనూ సంబంధాలు కలిగి ఉన్నారు.
బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత, మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఆగస్టు 8న బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మైనారిటీలపై, ముఖ్యంగా హిందువులపై దాడులు పెరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇళ్లు, దేవాలయాలు, వ్యాపార సంస్థలపై దాడులు, దహనాలు, బెదిరింపులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చిన్మోయ్ కృష్ణ దాస్కు బెయిల్ లభించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల బ్యాంకాక్లో జరిగిన బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధినేత యూనస్తో సమావేశమై మైనారిటీల భద్రత అంశాన్ని ప్రస్తావించారు. మైనారిటీలపై జరుగుతున్న దాడుల పట్ల భారత్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది.