Shubhanshu Shukla:అంతరిక్షంలో శుభాంశు శుక్లా ఏం చేస్తాడు?

ఎన్ని రోజులు ఉంటాడు?;

Update: 2025-06-25 06:00 GMT

అమెరికా ప్రైవేట్‌ స్పేస్‌ సంస్థ యాక్సియం చేపట్టిన మానవ సహిత అంతరిక్ష ప్రయోగం యాక్సియం-4 (ఏఎక్స్‌-4) మిషన్‌‌లో భాగంగా స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. భారత వ్యోమగామి శుభాన్షు శుక్లాతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్నారు. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నం 12.01గంటలకు స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి దూసుకెళ్లింది.

ప్రైవేట్‌ రోదసి యాత్ర ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా శుభాన్షు శుక్లా చరిత్రకెక్కారు. ఇప్పటికే భారత్‌కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. రష్యా సహకారంతో అంతరిక్షయానం చేశారు. రాకేశ్‌ శర్మ రోదసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల (1984) తర్వాత శుభాన్షు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. నాసా సహకారంతో శుక్లా అంతరిక్ష కేంద్రంలో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు.

నింగిలోకి దూసుకెళ్లిన వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానమవుతుంది. 15 రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. ఈ యాత్రలో భాగంగా నలుగురు సభ్యులు 60 శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించనున్నారు. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో అక్కడినుంచి ముచ్చటిస్తారు.

శుక్లా అంతరిక్షంలో ఏం చేస్తాడు?

యాక్సియం-4 వ్యోమగాములు 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహిస్తారు శుభాన్షు శుక్లా అంతరిక్ష కేంద్రంలో ఏడు పరిశోధన ప్రయోగాలను నిర్వహిస్తారు. దీర్ఘకాల రోదసి యాత్రల సమయంలో పోషకాహారం, జీవనాధార వ్యవస్థ విషయంలో ముందడుగు వేయడానికి ఉద్దేశించిన ప్రయోగాలు కూడా ఇందులో ఉంది. భారరహిత స్థితి వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని శోధిస్తారు. నాసా నిర్వహించే ఐదు ఉమ్మడి అధ్యయనాల్లో శుభాంశు పాల్గొంటారు.

Tags:    

Similar News