South African : సౌతాఫ్రికా బంగారు గనుల్లో వంద మంది మృతి

Update: 2025-01-15 09:00 GMT

దక్షిణాఫ్రికాలోని బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లిన వందలాది మంది కార్మికులు అక్కడే చిక్కుకుని ప్రాణాలు వదిలారు. వీరిని రక్షించేందుకు తొలుత విముఖత వ్యక్తం చేసిన అక్కడి ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రేన్‌ను లోనికి పంపించింది. అయితే, కొన్ని నెలలుగా అందులో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికిపైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్‌తో మరణించినట్టు అంచనా వేస్తున్నారు. దక్షిణాఫ్రికాలో బంగారు నిల్వలు అధికంగా ఉన్నాయి. అక్కడ అక్రమ మైనింగ్‌ సర్వ సాధారణమైపోయింది. వందల సంఖ్యలో ఉన్న పాడుపడిన బంగారు గనులు వీటికి అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలలపాటు అందులోనే ఉంటారు. ఆహారం, నీటితోపాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు.

జనవరి 10 నుంచి మొదలైన సహాయక కార్యక్రమాలతో ఇప్పటివరకు 35 మందిని సురక్షితంగా రక్షించినట్టు, 24 మృతదేహాలను బయటకు తీసినట్టు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. మరో 500 మంది ఇంకా భూగర్భంలోనే ఉన్నట్టు భావిస్తుండగా.. అందులో అనేకమంది ఆకలి, అనారోగ్యంతో అలమటిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News