రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇస్తోంది. మాస్కోతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం పన్ను విధిస్తామని భారత్తో సహా చైనా, బ్రెజిల్ దేశాలను నాటో హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె అమెరికా సెనెటర్లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. చైనా, భారత, బ్రెజిల్.. ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తూ.. వారి నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు. ఆయా దేశాలపై 100 శాతం పన్ను విధిస్తామన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుంని హెచ్చరించారు.
పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే ఇతర దేశాలు తీవ్ర నష్టపోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్కు ఎయిర్డిఫెన్స్లతో పాటు భారీగా క్షిపణులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రష్యాపై ట్రంప్ తీసుకుంటున్న చర్యలను యూఎస్ రిపబ్లికన్ సెనెటర్ థామ్ టిల్లిస్ ప్రశంసించారు. కానీ, 50 రోజల వరకు సమయం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో పుతిన్ యుద్ధంలో గెలవడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయని.. మరింత భూభాగాన్ని కాజేసి ఆ తర్వాత శాంతి చర్చలకు వస్తారని అన్నారు.