మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.
ఏప్రిల్ 2025 నుంచి ఇంటెల్ ఇప్పటికే తన ఉద్యోగుల సంఖ్యను దాదాపుగా 15 శాతం లేదా 15,000 మందిని తగ్గించింది. గతేడాది 15 వేల కన్నా ఎక్కువ మంది ఉద్యోగాల కోతల తర్వాత ఇది జరిగింది. 2025 రెండో త్రైమాసికానికి సంబంధించి ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్న సమయంలో ఇంటెల్ తొలగింపును ధ్రువీకరించింది.
ఇంటెల్ కొత్త సీఈఓ లిప్ బు టాన్ కంపెనీ ఎదుర్కొంటున్న క్లిష్ట కాలంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ప్రకటించారు. జర్మనీ, పోలాండ్ లో నిర్మించాలని భావించిన కొత్త ఫ్యాక్టరీలను ఇంటెల్ ప్రస్తుతం పక్కన పెట్టింది. కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాలకు మార్చనుంది. ఈ చర్యల ద్వారా నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తో్ంది.
ఒకప్పుడు ప్రపంచ చిప్ మార్కెట్ని ఏలిన ఇంటెల్ క్రమంగా తన పట్టును కోల్పోతోంది. 1990లలో పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ వ్యాపారంలో ఆధిపత్యం చెలాయించింది. స్మార్ట్ఫోన్ యుగంలో తన ఆధిపత్యాన్ని కోల్పోతూ వస్తోంది. మరోవైపు, ఎన్విడియా వంటి కంపెనీలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇంటెల్ ఏఐ చిప్ సెట్ విభాగంలో వెనకబడి ఉంది.