Iran Supreme leader: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపికపై సర్వత్ర ఆసక్తి

కొత్త నాయకుడిని ఎన్నుకోనున్న మత గురువుల మండలి

Update: 2026-03-01 06:15 GMT

ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన సైనిక దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితో దాదాపు 36 ఏళ్ల ఖమేనీ శకం ముగిసింది. ఆయన మరణంతో దేశం తీవ్ర అనిశ్చితిలో చిక్కుకోగా, పాలనా బాధ్యతలను చూసేందుకు తాత్కాలిక కమిటీ ఏర్పాటైంది.

రాజ్యాంగం ప్రకారం దేశ పరిపాలనను ముందుకు నడిపించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ బాధ్యతలు స్వీకరించింది. ప్రస్తుత అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, ప్రధాన న్యాయమూర్తి ఘోలం హుస్సేన్ మొహ్సేనీ-ఎజెయ్, గార్డియన్ కౌన్సిల్ ప్రతినిధి ఇందులో సభ్యులుగా ఉన్నారు. షరియా చట్టం ప్రకారం పరిపాలనకు ఆటంకం కలగకుండా వీరు నిర్ణయాలు తీసుకుంటారు.

కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకునే ప్రక్రియను ‘అసెంబ్లీ ఆఫ్ లీడర్‌షిప్ ఎక్స్‌పర్ట్స్’ (ప్రముఖ మత గురువుల మండలి) చేపట్టనుంది. అయితే, ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఖమేనీ వారసుడిగా ఎవరు వస్తారన్న దానిపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News