Khan Younis City : ఇజ్రాయెల్ దాడుల్లో ఖాన్ యూనిస్ నగరం విధ్వంసం

Update: 2024-07-03 07:28 GMT

దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరం మరోసారి బాంబులతో దద్దరిల్లింది. హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయెల్ సేనలు మెరుపుదాడికి దిగాయి. స్థానిక ప్రజలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించిన గంటల వ్యవధి లోనే ఐడీఎఫ్ తుపాకుల మోత మోగించింది. ఈ కాల్పుల్లో మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. 50 మందికిపైగా సామాన్య ప్రజలకు గాయాలైనట్లు చెప్పారు. ఖాన్ యూనిస్ నగరాన్ని ఖాళీ చేయాలంటూ స్థానిక పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ ఆదేశించింది. అంత లోనే దాడులకు పాల్పడ్డారు. ఖాన్ యూనిస్ నుంచి ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ ఉగ్రవాదులు రాకెట్లతో దాడులకు దిగారని, అందుకే ప్రతిదాడులు చేయాల్సి వచ్చిందని టెల్ అవీవ్ సమర్థించుకుంటోంది.

ఖాన్ యూనిస్ లోని నిస్సార్ ఆస్పత్రిలో ఉగ్రవాదులు ఉన్నారని పసిగట్టిన ఇజ్రాయెల్ సేనలు అర్ధ రాత్రి దాటిన తర్వాత అక్కడికి చేరుకున్నాయి. ఖాళీ చేయాలని ముందే హెచ్చరించినందున కాల్పులకు దిగాయి. అప్పటికే చాలా వరకు రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, ఈ ప్రక్రియ చివరి ఉండగానే సైన్యం బాంబుదాడులు చేసిందని నిస్సార్ ఆస్పత్రి డైరెక్టర్ తెలిపారు. దీనివల్లే 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. మరో వైపు అక్కడికి దగ్గర్లోని యూరోపియన్ ఆస్పత్రి చుట్టు పక్కల భవనాలపైనా ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. ఆ భవనాలన్నీ నేలమట్టమయ్యాయి.

Tags:    

Similar News