USA Green Card : భారతీయులకు ప్రాధాన్యత నివ్వండి
గ్రీన్ కార్డ్ జారీలో జాపాన్ని పరిష్కరించమంటూ అమెరికా చట్టసభ్యులు విజ్ఞప్తి
గ్రీన్ కార్డ్..అమెరికాలో శాశ్వతంగా నివసించాలంటే గ్రీన్కార్డు తప్పనిసరి. ఈ గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేస్తున్నవారి సంఖ్య భారీగా పెరిగిపోతుండగా.. కోటా విధానం వల్ల వాటి మంజూరు ఆలస్యం అయిపోతోంది.ఈ గ్రీన్కార్డు కోసం ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అమెరికాకు వెళ్లిన వారు ఏళ్ల తరబడి వేచిచూస్తుంటారు. ఇక భారత్ విషయానికి వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది. ఏళ్లకేళ్లు వేచి చూసినా గ్రీన్కార్డు అందుకోవడం భారతీయులకు సమస్యగా మారుతోంది.
ఈ నేపథ్యంలోనే భారతీయుల నుంచి వచ్చే దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలని, అమెరికా కాంగ్రెస్ సభ్యులు, అధ్యక్షుడు జో బైడెన్ను కోరారు. ఈ మేరకు రాజా కృష్ణమూర్తి, లేరీ బుల్షన్ నేతృత్వంలో 56 మంది శాసనకర్తలు ప్రభుత్వానికి లేఖ రాశారు.
ప్రస్తుతం ఉన్న ప్రాతిపదికన భారతీయులకు గ్రీన్ కార్డులు రావాలంటే 195 ఏళ్లు నిరీక్షించాల్సి వస్తుందన్న విషయాన్ని వారు ఈ సందర్బంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లారు. దీనివల్ల దరఖాస్తుదారుల్లో నిరంతర అనిశ్చితి కనిపిస్తోందన్నారు. అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ ప్రాతిపదికన ఇచ్చే వీసాల విషయంలో కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లి ఉపశమనం కల్పించాలని విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ను, ఇంటర్నల్ సెక్యూరిటీ వింగ్ని వారు కోరారు.
బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ ప్రచురించిన ఎంప్లాయ్మెంట్-బేస్డ్ వీసా బులెటిన్లో ఉపాధి ఆధారిత వీసా దరఖాస్తులను దాఖలు చేయడానికి అన్ని తేదీలను ‘ప్రస్తుతం’గా గుర్తించాలని వారు తమ లేఖలో విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా చేయడం ద్వారా చట్టబద్ధంగా అమెరికాకు రావాలనుకుంటున్నవారికి ఊరట ఇవ్వాలని శాసనకర్తలు తమ లేఖలో పేర్కొన్నారు.
రకరకాల కారణాలవల్ల వీసాలు పెండింగులో పడిపోయి.. ఉద్యోగాలు మారాలనుకున్నవారికి, వ్యాపారాలు ప్రారంభించేవారికి, అపరాధ రుసుం లేకుండా విదేశాలకు ప్రయాణించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు వివరించారు.
ఇండియన్ డయాస్పోరా స్టడీస్' (ఎఫ్ఎస్ఐఐడీఎస్ యూఎస్ఏ), 'ఫౌండేషన్ ఫర్ ఇండియా, కూడా ఇప్పటికే జో బైడెన్కు ఈ సమస్యపై విజ్ఞప్తి చేసింది. దేశాలవారీగా ఏడు శాతం కోటాను అమలు చేస్తున్న విధానం వల్ల భారత్ వంటి దేశాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించింది. గ్రీన్కార్డ్ రాకపోవడం వల్ల యజమానుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితిలో దాదాపు 10 లక్షల మంది ఉన్నారని 'ఇమ్మిగ్రేషన్ వాయిస్' అధ్యక్షులు పేర్కొన్నారు.