India Pakistan: బంగ్లాతో కలిసి పాక్ కుట్రలు.. అస్థిరతను సృష్టించేందుకు ఐఎస్ఐ ప్లాన్..
బంగ్లాదేశ్-మయన్మార్ సరిహద్దుల్లో హై అలర్ట్..;
భారత్ దాడి చేస్తే ఎదురుదాడి చేయడానికి పాకిస్తాన్ మరో కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. భారతీయ నిఘా సంస్థలు షాకింగ్ విషయాలు వెల్లడించాయి. దీంతో ఇండియన్ ఆర్మీ అప్రమత్తమైంది. పాకిస్తాన్ ఇప్పటికే తన సైన్యాన్ని భారత సరిహద్దుల్లో మోహరించింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, బంగ్లాదేశ్ సాయంతో భారత సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. ఈమేరకు బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించింది.
రాడికల్ గ్రూపులను పాకిస్తాన్ గూఢచార సంస్థ “ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్” (ఐఎస్ఐ) యాక్టివ్ చేసినట్లు తెలుస్తోంది. రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తోందని భారత నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. హై సర్వెలైన్స్లో నిఘా వర్గాలు ఉన్నాయి. బంగ్లా సరిహద్దుల్లో భారత సైనిక దళాలు అప్రమత్తమయ్యాయి.
షేక్ హసీనా పదవిలో ఉన్నంత కాలం భారత్కి బంగ్లాదేశ్ అత్యంత మిత్రదేశంగా ఉంది. ఎప్పుడైతే, ఆ దేశంలో మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పదవిలోకి వచ్చిందో అప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలను బలపరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే యూనస్ సర్కార్ పాక్ ఐఎస్ఐకి మద్దతు ఇస్తోందనే ఆరోపణ ఉంది. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ సైనిక అధికారులుఉన్నట్లు భారత్ నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నాయి. రోహంగ్యా శరణార్థుల్ని ఉపయోగించి అస్థిర పరిచే ప్రయత్నాలకు తెరతీసింది. దీనికి తోడు బెంగాల్లో నకిలీ పాస్పోర్టులో ఉన్న పాక్ జాతీయుడిని అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. మరోవైపు, ఉగ్రవాదం,జాతీయ భద్రతతో రాజీపడేది లేదని కేంద్రం పునరుద్ఘాటించింది.