ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) భూటాన్ (Bhutan) వెళ్లారు. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని థింపులో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల పాటు ఆయన అక్కడే పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ చర్చలు జరపనున్నారు. వివిధ కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొననున్నారు. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'డ్యూక్ గ్యాల్పో'ను మోదీ అందుకోనున్నారు. ఈ అవార్డును 2021లోనే భూటాన్ ప్రభుత్వం మోదీకి ప్రకటించింది. మోదీ నిన్ననే భూటాన్ వెళ్లాల్సి ఉండగా.. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పర్యటన వాయిదా పడింది.
భారతదేశం – భూటాన్ల మధ్య సాధారణ ఉన్నత స్థాయి సంబంధాలు మెరుగుపర్చేందుకు, ‘నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ’ లో భాగంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ప్రధాని మోదీ.. భూటాన్ రాజుతో చర్చించనున్నారు. తన పర్యటన సందర్భంగా, ప్రధాన మంత్రి భూటాన్ రాజు హిస్ మెజెస్టి జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్, భూటాన్ నాల్గవ రాజు హిస్ మెజెస్టి జిగ్మే సింగ్యే వాంగ్చుక్లతో భేటీ అవుతారు.అంతేకాకుండా.. ప్రధాని మోదీ భూటాన్ కౌంటర్ షెరింగ్ టోబ్గేతో కూడా చర్చలు జరపనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.