Bangladesh: బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల చిచ్చు..
హింసాత్మక నిరసనల్లో 25 మంది మృతి;
మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా చిచ్చు రగులుకుంది. ప్రభుత్వం భర్తీ చేసే సివిల్ సర్వీస్ పోస్టులలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై విద్యార్థులు భగ్గుమన్నారు. దేశవ్యాప్తంగా ఈ నెల 1 నుంచి ఆందోళన చేపడున్నారు. ఇది హింసాత్మకంగా మారడంతో 32 మంది మరణించగా, 2,500 మందికి పైగా గాయపడ్డారు. మృతులలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాళ్లు, ఇతర మారణాయుధాలతో భద్రతా దళాలపై దాడులకు దిగుతున్న దృశ్యాలు దేశమంతా కన్పిస్తున్నాయి.
రాజధాని ఢాకాతో పాటు ఛట్టోగ్రామ్, రంగ్పూర్, క్యుమిలా వంటి ప్రాంతాలకు ఈ హింస పాకడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని పౌరులు బిక్కుబిక్కుమంటున్నారు. గురువారం కొందరు విద్యార్థులు రంగ్పూర్లోని రోకియా యూనివర్సిటీ వీసీ గృహాన్ని తగలబెట్టారు. బంగ్లాలో హింసాత్మక ఘటనలు జరుగుతుండటంతో ఆ దేశానికి ప్రయాణాలు పెట్టుకోవద్దంటూ భారత్ తమ పౌరులకు అడ్వయిజరీ జారీ చేసింది.
ఆందోళన చేస్తున్న విద్యార్థులు గురువారం మధ్యాహ్నం దక్షిణ ఢాకాలోని రాంపురలో ఉన్న బంగ్లాదేశ్ టెలివిజన్ సెంటర్కు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఆ భవనంతో పాటు ఆవరణలో ఉన్న కార్లు, బైక్లు, ఇతర వాహనాలు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. పలువురు సిబ్బంది, పాత్రికేయులు భవనం లోపలే చిక్కుకుపోయారు. ముందు జాగ్రత్త చర్యగా బంగ్లాలోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఢాకా, ఇతర నగరాలలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (బీజీబీ) రక్షణలో ప్రభుత్వ ఆఫీస్లు, బ్యాంక్లు పనిచేస్తున్నాయి. ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ సిబ్బంది వీధులలో పహారా కాస్తున్నారు.
బంగ్లాదేశ్లో నెట్వర్క్ అందక గురువారం పలువురు మొబైల్ యూజర్లు ఇబ్బందులు పడ్డారు. తమ ఫోన్లలో ఇంటర్నెట్ పనిచేయడం లేదని పలువురు ఫిర్యాదులు చేశారు. 16 నుంచి అన్ని యూనివర్సిటీలలో 4జీ నెట్వర్క్ను నిలిపివేశారు. అయితే 2జీ నెట్వర్క్ పనిచేస్తుండటంతో సాధారణ వాయిస్ కాల్స్ చేసుకుంటున్నారు.