భారత్ సహా కొన్ని వర్ధమాన దేశాల ఎన్నికల వ్యవస్థలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రశంసించారు. ఇకపై దేశంలో ఓటు హక్కు నమోదుకు పౌరసత్వ పత్రాలను చూపాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ‘స్వపరిపాలనలో అత్యున్నతంగా ఉన్నప్పటికీ ఎన్నికల భద్రతలో వర్ధమాన దేశాలతో పోలిస్తే US విఫలమైంది. భారత్, బ్రెజిల్ వంటివి బయోమెట్రిక్ డేటాబేస్ (ఆధార్)తో ఓటరు గుర్తింపును ముడిపెట్టాయి’ అని ఆయన వివరించారు. భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎన్నికల నిర్వహణ తీరును ప్రస్తావిస్తూ.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండింటిలోనూ ఇప్పటికే ప్రామాణికమైన ‘ప్రాథమిక, అవసరమైన ఎన్నికల రక్షణలను’ అమలు చేయడంలో అమెరికా విఫలమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్కు అనుసంధానిస్తున్నాయి. అయితే, అమెరికా మాత్రం ఇప్పటికీ పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాలెట్ ప్రాసెసింగ్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న అస్థిర విధానాన్ని ట్రంప్ విమర్శించారు. మోసం, లోపాలు, లేదా అనుమానాలు లేని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, నిజాయతీ గల ఎన్నికలు మన రాజ్యాంగ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రాథమికమైనవని ట్రంప్ నొక్కి వక్కాణించారు.