IRAN: "అమెరికాకు లొంగే ప్రసక్తి లేదు.."
గల్ఫ్ దేశాలకు ఇరాన్ క్షమాపణలు... పొరుగు దేశాలపై దాడులు నిలిపివేత.. అమెరికాకు స్ట్రాంగ్ వార్నింగ్
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ అత్యంత కీలకమైన ప్రకటన చేశారు. ఇటీవల గల్ఫ్ దేశాలపై జరిగిన దాడులకు సంబంధించి ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఇరాన్ ప్రజలను ఉద్దేశించి విడుదల చేసిన ఒక ప్రత్యేక వీడియో సందేశంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశాలైన దుబాయ్, కువైట్, బహ్రెయిన్, యూఏఈ వంటి దేశాలలోని చమురు రిఫైనరీలు, విమానాశ్రయాలపై తమ మిస్సైల్స్ దాడులు చేయడం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశంతోనే తాము ఈ శాంతి నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.ఇజ్రాయెల్, అమెరికా దేశాల దాడులకు ప్రతీకారంగానే ఇరాన్ గతంలో గల్ఫ్ దేశాలలోని యూఎస్ఏ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విరుచుకపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఆయా దేశాలలోని పౌర వసతులపై కూడా దాడులు జరగడంతో గల్ఫ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే పెజెష్కియాన్ స్పందిస్తూ, ఆ దేశాలపై దాడులు చేయడం తమ అసలు ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. కేవలం తమ ఆత్మరక్షణ కోసమే ఆ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని, జరిగిన నష్టానికి చింతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఇకపై గల్ఫ్ దేశాలపై ఎలాంటి దాడులు జరగబోవని ఇరాన్ తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించినట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. పొరుగు దేశాలకు పెజెష్కియాన్ ఒక ముఖ్యమైన హెచ్చరికతో కూడిన విన్నపాన్ని కూడా చేశారు. తమ భూభాగాలను అమెరికా సైనిక స్థావరాలుగా మార్చవద్దని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాలలోని అమెరికా స్థావరాల నుంచి తమపై దాడులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలదేనని ఆయన గుర్తుచేశారు. ఒకవేళ పొరుగు దేశాల నుంచి తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం, ధీటుగా స్పందించే హక్కు ఇరాన్కు ఉంటుందని ఆయన తేల్చిచెప్పారు. "మీరు మా జోలికి రాకుంటే.. మేము మీ జోలికి రాము" అనే స్పష్టమైన సందేశాన్ని ఆయన గల్ఫ్ దేశాలకు పంపారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేసినట్లుగా ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలన్న ప్రతిపాదనను పెజెష్కియాన్ పూర్తిగా తోసిపుచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తి లేదని ఆయన మొండిగా ప్రకటించారు. ఇరాన్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తే లేదని, బెదిరింపులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ను లొంగదీసుకోవాలన్న అమెరికా కలలు ఎప్పటికీ సాకారం కావని, ఆ ఆశలను వారు సమాధి చేసుకోవాల్సిందేనని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాము గమనిస్తున్నామని, శాంతి స్థాపన కోసమే తాము ఒక అడుగు వెనక్కి వేసి క్షమాపణలు చెబుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు వివరించారు. అయితే ఇది తమ బలహీనత కాదని, బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. గల్ఫ్ దేశాలతో సంబంధాలను తిరిగి మెరుగుపరుచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ అందుకు అమెరికా ప్రమేయం లేకుండా ఉండాలని ఆయన కోరారు. యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం అటు అరబ్ దేశాలలో, ఇటు పాశ్చాత్య దేశాలలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.ఈ పరిణామం పశ్చిమాసియా రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆగ్రహాన్ని చల్లార్చడం ద్వారా అమెరికాను ఒంటరిని చేయాలనేది ఇరాన్ ఎత్తుగడగా కనిపిస్తోంది. యుద్ధం కొనసాగుతున్న తరుణంలో పెజెష్కియాన్ చేసిన ఈ ప్రకటన అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ పట్ల ఉన్న వ్యతిరేకతను కొంత మేర తగ్గించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షలు, ట్రంప్ హెచ్చరికల మధ్య ఇరాన్ తన పంథాను మార్చుకోకుండానే శాంతి మంత్రాన్ని జపించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.