Heavy Rain : అలర్ట్.. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన

రెండు తెలుగు రాష్ట్రాలలో వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మంగళవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
ఈ అల్పపీడనం ప్రభావం తో ఏపీ లోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదేవిదంగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com