న్యాయస్థానాల్లో తప్పక విజయం సాధిస్తాం : అమరావతి రైతులు

రాజధాని అమరావతి ఉద్యమం 272వ రోజుకు చేరింది. 29 గ్రామాల్లోను మహిళలు, రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు, వెలగపూడి సహా మరికొన్ని శిబిరాల్లో దీక్షల్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటున్నారు. రాజధానిగా అమరావతినే కొనసాగిస్తామని ప్రభుత్వం చెప్పేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారంటున్నారు. రోజుకో కార్యక్రమంతో వినూత్నంగా నిరసన తెలియజేస్తున్నారు రైతులు.
ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్ కోసం భూములు త్యాగం చేస్తే... జగన్ సర్కారు అనాలోచితంగా రాజధాని తరలిస్తోందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వానికి 33 వేల ఎకరాల భూమి ఇచ్చిన అన్నదాతల త్యాగాల్ని విస్మరించవద్దని కోరుతున్నారు. వైసీపీ సర్కార్ మాట తప్పిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానిని తరలింపుతో రైతులకు అన్యాయం చేయొద్దని అమరావతి రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అన్యాయం చేశాయని... న్యాయస్థానాల్లో తమకు తప్పక విజయం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 272 రోజులుగా నిరసన గళం వినిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. సర్కారు దిగివచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని చెబుతున్నారు. ప్రజా సమస్యలపై పట్టించుకోకుండా వైసీపీ ఎమ్మెల్యేలు రాజధానిపై కనీసం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
మంత్రి బొత్సపై అమరావతి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అని పదేపదే చెప్తున్న బొత్స.. ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించింది. అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఎందుకు బయటపెట్టలేకపోయారని ధ్వజమెత్తింది. . ఈ ప్రభుత్వానికి దళితులే ఘోరీ కట్టే సమయం ఆసన్నమైందని జేఏసీ ప్రతినిధులు మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com