ఇంత రాక్షసత్వమా..? వాళ్లేం పాపం చేశారు..?

అమరావతి ఉద్యమం మరింత ఉధృతమైంది. మందడంలో నిరసన తెలిపేందుకు వస్తున్న రైతులు, మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మహిళలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది..
మరి ఇంత రాక్షసత్వమా..? వాళ్లేం పాపం చేశారు..? రాజధానికి భూములు ఇవ్వడమే మహిళలు చేసిన నేరమా..? తమకు జరిగిన అన్యాయాన్ని నిలదీయడమే తప్పా..? ఇలా రోడ్లపై ఈడ్చుకెళ్తారా.? జుత్తు పట్టి గుంజిపడేస్తారా..? మహిళలపట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా..? అక్రమ అరెస్టులు.. ఆందోళనలతో అమరావతి ప్రాంతం అట్టుడుకుంది. కృష్ణా, గుంటూరు సహా రాజధాని గ్రామాలు రణరంగాన్ని తలపించాయి.
కృష్ణాయపాలెంలో రైతులకు సంకెళ్లు వేయడానికి నిరసనగా జైల్ భోరా కార్యక్రమానికి అమరావతి జేఏసీ నేతలు పిలుపు ఇచ్చారు. దీంతో జైల్ భరో కోసం పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలపట్ల పోలీసులు రాక్షసంగా ప్రవర్తించారు. దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చిపడేశారు. మహిళలని కూడా చూడకుండా కర్కశంగా వ్యవహరించారు.. ఈ క్రమంలో పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి.
శాంతియుత నిరసనపై పోలీసుల జులుం ఏంటని మహిళలు కన్నీరు పెట్టారు. భూములు ఇచ్చిన తమపై ఈ వేధింపులు ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలను ఉదయం నుంచే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అకారణంగా దళిత రైతులను 8 రోజులుగా జైల్లో కుక్కడం ఏ చట్టం ప్రకారం చేశారని జేఏసీ నేతలు ప్రశ్నించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయాలి అనుకుంటే.... మరింత ఉవ్వెత్తున ఎగసిపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాజధానికి భూములిచ్చిన తమపైనే పోలీసులు వ్యవహరించిన తీరు ఆవేదన కల్గిస్తోందంటున్నారు తుళ్లూరు రైతులు. సీఎం జగన్ ఉన్మాదంతో పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. రైతులు ఏం తప్పు చేశారని.. వారిపై దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అమరావతి సాధించేవరకు పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
గుంటూరులో సబ్ జైలు దగ్గర చీకటి పడినా ఉద్రిక్తతలు కొనసాగాయి. జైల్ భరో కార్యక్రమానికి వచ్చిన రైతులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కొంత మందిని అరండల్పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళా జేఏసీ నేత రాయపాటి శైలజతో సహా మరికొందరి రైతులను తాడికొండ స్టేషన్ కు తరలించారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని రైతులు మండిపడుతున్నారు.
జైల్ భరో కార్యక్రమంలో భాగంగా గోడలు దూకి గుంటూరు సబ్ జైలు వద్దకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ నాయకుడు మన్నెం శివనాగమల్లేశ్వరరావుతో పాటు అతని అనుచరులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. విపక్ష నాయకుల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
పోలీసులు, ప్రభుత్వం తీరుకు నిరసనగా ఉద్యమాన్ని మరింత తీవ్ర చేసేందుకు జేఏసీ నేతలు సిద్ధమవుతున్నారు.. సంకెళ్లు వేసిన రైతులను భే షరుతుగా విడుదల చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com