CM Chandrababu : ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..పరిశ్రమలకు ఇక తిప్పలుండవు..చంద్రబాబు సర్కార్ కొత్త విధానం.

CM Chandrababu : ఇన్వెస్టర్లకు రెడ్ కార్పెట్..పరిశ్రమలకు ఇక తిప్పలుండవు..చంద్రబాబు సర్కార్ కొత్త విధానం.
X

CM Chandrababu : సాధారణంగా ప్రభుత్వాలు ఇండస్ట్రీల కోసం అనేక రకాల ప్రోత్సాహక ప్యాకేజీలను ప్రకటిస్తాయి. అయితే ఆ డబ్బులు చేతికి అందేసరికి పరిశ్రమల యజమానులు ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రులు, అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఎస్క్రో అకౌంట్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులు తీవ్రంగా స్వాగతిస్తున్నారు.

ఏమిటీ ఎస్క్రో అకౌంట్ విధానం?

ఎస్క్రో అకౌంట్ అనేది ఒక మధ్యవర్తి బ్యాంకు ఖాతా. ఈ కొత్త విధానం ప్రకారం.. ఏదైనా పరిశ్రమ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత, ఆ సంస్థ పేరుతో ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తారు. MOUలో భాగంగా ప్రభుత్వం ఆ సంస్థకు ఎంత ప్రోత్సాహక నిధులు ఇవ్వడానికి అంగీకరించిందో, ఆ డబ్బును బ్యాంక్ ద్వారా నేరుగా ఈ ఎస్క్రో అకౌంట్‌కు పంపిస్తారు. పరిశ్రమల యజమానులు ఈ డబ్బుల కోసం ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం రియల్ టైమ్లోనే నేరుగా ఈ డబ్బును ఆ ఎస్క్రో అకౌంట్‌కు విడుదల చేస్తుంది.

సీఎం చంద్రబాబు ప్రకటన

గత వారం జరిగిన 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కీలక విధానాన్ని ప్రకటించారు. "మా ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు, వాతావరణాన్ని ఇప్పటికే అందించింది. ఇప్పుడు ఎస్క్రో అకౌంట్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. ఇక పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి వచ్చి, తమ వ్యాపారాలను ప్రారంభించడమే మిగిలి ఉంది" అని ఆయన వ్యాఖ్యానించారు.

పెట్టుబడుల లక్ష్యం రూ. 90 లక్షల కోట్లు

ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల లక్ష్యాలను కూడా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వెల్లడించారు. గత 18 నెలల్లో ఏపీ 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.6లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించింది. దీని వల్ల 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. రాబోయే మూడు సంవత్సరాలలో 500 బిలియన్ డాలర్ల (సుమారు రూ.40లక్షల కోట్లు) పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యం. దీని ద్వారా 50 లక్షల ఉద్యోగాలు వస్తాయి. తదుపరి ఒక దశాబ్దంలో 1 ట్రిలియన్ డాలర్ (సుమారు రూ.89లక్షల కోట్లు) పెట్టుబడిని ఆకర్షించాలనే భారీ లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఆనంద్ మహీంద్రా ప్రశంసలు

పెట్టుబడిదారుల కోసం ఎస్క్రో అకౌంట్ విధానం గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. "ఈ మనిషిని ఆపడం కష్టం. దశాబ్దాలుగా నేను ఆయనను చూస్తున్నాను. అభివృద్ధిపై ఆయనకున్న ఆకాంక్షతో పాటు, కొత్త తరహా విధానాలను అమలు చేయాలనే ఆయన సంకల్పాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను" అని ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

Tags

Next Story