అప్పుల్లో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్‌.. ఆందోళన కలిగిస్తున్న కాగ్‌ లెక్కలు

అప్పుల్లో అగ్రభాగాన ఆంధ్రప్రదేశ్‌.. ఆందోళన కలిగిస్తున్న కాగ్‌ లెక్కలు
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమల్లో ఏపీ దూసుకుపోతుంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి రెండోవైపు చూస్తే అన్నీ అప్పులే

దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమల్లో ఏపీ దూసుకుపోతుంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. నాణేనికి రెండోవైపు చూస్తే అన్నీ అప్పులే. 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే భారీ రుణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు 11 నెలల్లో 79వేల 191 కోట్ల అప్పులు తీసుకున్నట్లు కాగ్‌ లెక్కలు వెల్లడించాయి. దేశంలో ఆర్థికంగా, జనాభాపరంగా పెద్దగా ఉన్న 14 రాష్ట్రాల్లో ఏదీ ఇంత భారీ స్థాయిలో అప్పులు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో పొందుపరిచిన అంచనాలతో పోలిస్తే 63.97శాతం మేర రుణాలు అధికంగా సేకరించింది. కరోనా కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల ఆదాయాలూ దాదాపు ఒకేస్థాయిలో అంటే 60శాతం దాకా ఉన్నప్పటికీ అప్పుల విషయంలో మాత్రం ఏపీ అన్నింటినీ మించిపోయింది.

కాగ్‌ లెక్కలను విశ్లేషిస్తే ఏపీ ఈ 11 నెలల్లో నెలకు సగటున 7వేల199 కోట్లు రుణం సేకరించినట్లు అర్థమవుతోంది. గత ఏడాది ఫిబ్రవరి నాటికి ఉన్న 52వేల 090 కోట్ల అప్పుతో పోలిస్తే ఈ ఏడాది అదే సమయానికి అప్పుల భారం 52శాతం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఆదాయ, వ్యయాల్లో భారీ వ్యత్యాసం లేకపోయినా అప్పుల్లో ఇంత భారీ తేడా రావడానికి కారణమేంటో స్పష్టంగా కనిపించలేదు. బడ్జెట్‌లో పొందుపరిచిన ఖర్చుల్లో ఇప్పటి వరకు పింఛన్లు 102శాతం, రాయితీలు 123శాతం మాత్రమే అంచనాలను మించాయి. మిగిలిన ఖర్చులన్నీ ఆలోపే ఉన్నాయి. ఫిబ్రవరి వరకు రెవెన్యూ వ్యయం 86.96శాతం, మూలధన వ్యయం కేవలం 66.98శాతం మాత్రమే జరిగింది. మిగిలిన నెల రోజుల్లో మిగతాది ఖర్చు చేయడం కష్టమే.

గత 11 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను, పన్నేతర ఆదాయం 71వేల 699 కోట్లు కాగా అప్పు 79వేల 191 కోట్లు. అంటే ఆదాయం కంటే అప్పు 10.44శాతం అధికం. దేశంలోని 14 పెద్ద రాష్ట్రాల్లో అయిదింటి ఆదాయం ఆంధ్రప్రదేశ్‌ కంటే అధికంగా పడిపోయింది. ఆ రాష్ట్రాలకు బడ్జెట్‌లో చెప్పినదాంట్లో 60శాతం లోపే ఆదాయం వసూలైంది. కానీ అవేవీ ఇంత భారీస్థాయిలో అప్పులు తీసుకోలేదు. 9 రాష్ట్రాలు బడ్జెట్‌లో చెప్పినదానికంటే తక్కువ మొత్తంలోనే రుణాలకు పరిమితమయ్యాయి. అయిదు రాష్ట్రాలు 100శాతానికి మించి అప్పులు చేశాయి. చెప్పినదానికంటే అధికంగా రుణాలు తీసుకున్నవాటిలో నిష్పత్తిపరంగా రాజస్థాన్‌ తొలి స్థానంలో నిలిచింది. ఏపీ 2, పశ్చిమబెంగాల్‌ 3, తెలంగాణ 4, కేరళ 5వ స్థానాల్లో ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story