AP: నేడు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం భేటీ

AP: నేడు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం భేటీ
X
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్‌ భేటీ... కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినేట్‌ భేటీ జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న ఇదే తొలి మంత్రివర్గ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివిధ శాఖల్లో వాస్తవ స్థితిగతులను తెలిపేలా వైట్‌ పేపర్ విడుదలకు సంబంధించి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ రద్దు, పింఛను మొత్తం రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై చంద్రబాబు అయిదు సంతకాలు చేశారు. ఇవాళ్టీ మంత్రివర్గ సమావేశంలో వీటికి ఆమోదం తీసుకునే అవకాశం ఉంది. సూపర్‌ 6 పథకాల అమలు, అందుకు అనుగుణంగా బడ్జెట్‌ రూపకల్పనపైనా మంత్రివర్గంలో చర్చిస్తారని తెలుస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో చంద్రబాబు పర్యటించారు. మంత్రివర్గ సమావేశంలో ప్రాజెక్టుల పరిస్థితి, పూర్తి చేసేందుకు నిధుల సమీకరణపైనా చర్చించనున్నట్లు తెలిసింది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉంది. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్య అంశాలపైనా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నారు. వాటిని కూడా మంత్రివర్గం ముందుంచి ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.


శ్వేతపత్రాల విడుదల

చంద్రబాబు వరుస సమీక్షలు నిర్వహిస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 5కీలక హామీలకు సంబందించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేసిన సీఎం, వాటి అమలుపై దృష్టి పెట్టారు. జూలై 1వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో హామీ ఇచ్చిన ప్రకారం పెంచిన పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకోకుండా ఉండే దిశగా ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలో శ్వేతపత్రాల విడుదలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎనిమిది అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే దిశగా చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శ్వేతపత్రాల విడుదల కీలకం కానుంది.

Tags

Next Story