CBN: సాంకేతికతతో రోగుల చెంతకే వైద్యసేవలు

CBN: సాంకేతికతతో రోగుల చెంతకే వైద్యసేవలు
X
సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలన్న చంద్రబాబు.. విద్యార్థులకు రాష్ట్రపతి స్పూర్తి అన్న సీఎం

మెడికల్‌ సైన్స్‌లో టెక్నాలజీ వినియోగంతో వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సాంకేతికతతో రోగుల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లవచ్చని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు. మెడికల్‌ సైన్స్‌ ఇప్పుడు మెడ్‌టెక్‌ సైన్స్‌ అయిందని, డీప్‌టెక్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానంపై వైద్య విద్యార్థులు పట్టు సాధించాలని చంద్రబాబు సూచించారు. రోగులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఆస్పత్రులకు వెళ్లకుండా.. ఇళ్ల వద్దే వారికి వైద్య చికిత్స అందించేలా వైద్య రంగాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దాలని సూచించారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ తొలి స్నాతకోత్సవానికి హాజరుకావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేశారు.


రాష్ట్రపతి అందరికీ స్ఫూర్తి

మహిళలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్ఫూర్తి అని, ఒడిశాలో చిన్న గ్రామలో పుట్టి ఆదర్శవంతంగా ఎదిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు. మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబం నుంచి ఆమె రాష్ట్రపతికి స్థాయి ఎదగడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఉపాధ్యాయురాలిగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. జూనియర్‌ అసిస్టెంట్‌గా, ప్రొఫెసర్‌గా, కౌన్సిలర్‌గా, చైర్‌పర్సన్‌గా, ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా, గవర్నర్‌గా పలు బాధ్యతలు నిర్వర్తించారని.. ఇప్పుడు దేశానికి ప్రథమ పౌరురాలు అయ్యారని.. పట్టుదలతో కష్టపడితే ఎవరైనా అత్యున్నత స్థానానికి చేరుకోవచ్చని నిరూపించారని తెలిపారు. తాను కూడా చిన్న గ్రామం నుంచే వచ్చానన్నారు. దేశంలో ఏ ఎయిమ్స్‌కూ లేనట్లుగా మంగళగిరి ఎయిమ్స్‌కు మంచి వాతావరణంలో దాదాపు 183 ఎకరాలు ఇచ్చామని చెప్పారు.

మూత్రపిండాల మార్పిడి కూడా చేస్తాం: కేంద్రమంత్రి

కేంద్ర ఆయుష్, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ మాట్లాడుతూ మూత్రపిండాల మార్పిడి వంటి అత్యాధునిక సేవలు మంగళగిరి ఎయిమ్స్‌లో అందుబాటులోకి రాబోతున్నాయని చెప్పారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మధుబానందకర్‌ తన ప్రసంగంలో ఎయిమ్స్‌ ప్రస్థానాన్ని వివరించారు. ట్రామా వైద్య సేవలు మెరుగుపరిచేందుకు జాతీయ రహదారికి దగ్గర్లో పది ఎకరాల స్థలాన్ని వెంటనే అప్పగించాలని కోరారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును ముఖ్యమంత్రి చంద్రబాబు శాలువతో సన్మానించి, తిరుమల శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. వైద్య విద్యార్థులతో పాటు అధ్యాపకులు కలంకారీ ప్రింటింగ్‌తో కూడిన మంగళగిరి చేనేత వస్త్రాలు ధరించారు.

Tags

Next Story