CBN: ఆడవాళ్లే తెలివైనవారు: చంద్రబాబు

మగవాళ్ల కంటే ఆడవాళ్లే చాలా తెలివైన వారని ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభ వేదికగా ప్రకటించారు. అందుకే మహిళలను దృష్టిలో పెట్టుకునే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన వాటా ఇచ్చింది ఎన్టీఆరే అన్న చంద్రబాబు... ఇప్పుడు మహిళలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితులు ఉన్నాయన్నారు. మన సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
అమరావతి పోరాటం చిరస్మరణీయం
శాసనసభ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ప్రజా రాజధాని అమరావతి మళ్లీ బతికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మూడు రాజధానులంటూ గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు పోరాటాల చరిత్రలో అమరావతి పోరాటం చిరస్మరణీయమని చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారని.. అసలు వారి చేసిన పాపమేంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
టీడీపీతోనే మహిళా సాధికారత
అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగిస్తున్నారు. ‘1983లో మహిళా యూనివర్శిటీని టీడీపీ స్థాపించింది. 1995లో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చాం. 1996లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాం. ఇప్పుడు మహిళలకే ఎదురు కట్నం ఇచ్చే పరిస్థితి వచ్చింది. 8,9 వ తరగతి అమ్మాయిలకు సైకిళ్లు ఇచ్చాం. టీడీపీతోనే మహిళా సాధికారత ప్రారంభమైంది’ అని వెల్లడించారు.
వాళ్లు చేసిన పాపమేంటి
అమరావతి మహిళలు చేసిన పాపం ఏంటని సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ప్రశ్నించారు. ‘వాళ్ల భూమి మీద కూర్చుని.. వాళ్లనే హింసించారు. రాజధాని కోసం భూములిచ్చినవాళ్లను వేధించారు. అయినా వెనకడుగు వేయకుండా గత ఐదేళ్లు అమరావతి మహిళలు వీరోచితంగా పోరాడారు. వాళ్ల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది’. అని చంద్రబాబు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com