AP: అమిత్ షాతో నేడు చంద్రబాబు భేటీ

ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు పర్యటించనున్నారు. ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరానికి ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. అనంతరం ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం కార్యక్రమంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరపనున్నారు. రాంలీలా మైదానంలో రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. పర్వేశ్ వర్మ కూడా మంత్రిగా ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి 30 వేలమంది హాజరుకానున్నారు. చంద్రబాబు సహా ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్కు సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి రైతుల ఆర్థిక పరిస్థితి బాగోలేదని, వెంటనే కేంద్రం మిర్చి కొనుగోలు చేయాలని కోరారు. గతంలో ప్రత్యేక వెరైటీ మిర్చి ధర రూ.20వేలు ఉండగా, ప్రస్తుతం రూ.13వేలకు పడిపోయిందన్నారు. దీంతో మిర్చి ప్రజలు ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్నారని లేఖలో పేర్కొన్నారు. పలు దేశాలకు ఎగుమతులు తగ్గడంతో కొనుగోళ్లు తగ్గినట్లు తెలిపారు.
వీసీల నియామకంపై సీఎం క్లారిటీ
వీసీల నియామకంలో రాజకీయాలు, లాబీయింగ్లు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న విమర్శలపై సీఎం చంద్రబాబు స్పందించారు. మెరిట్ ఆధారంగానే వర్సిటీలకు వీసీలను ఎంపిక చేశామని చెప్పారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు. భావిపౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్యది కీలకపాత్ర అన్న చంద్రబాబు.. రాష్ట్రంలో ఉన్నత విద్య సరికొత్త అధ్యాయం దిశగా సాగనుందన్నారు. ఉన్నత విద్యాభివృద్ధికి కొత్త వీసీలు పనిచేయాలని కోరారు. వైస్ ఛాన్సలర్లను పూర్తి మెరిట్ ఆధారంగా నియమించామని తెలిపారు. భావి పౌరులను తీర్చిదిద్దడంలో ఉన్నత విద్య కీలక పాత్ర పోషిస్తోందన్నారు. గత పాలనలో రాజకీయ ప్రభావం, లాబీయింగ్తో వీసీల నియామక ప్రక్రియ బలహీనపడిందని విమర్శించారు. మొదటిసారిగా ఎస్టీ మహిళ ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారన్నారు. ఇది విద్య, సామాజిక న్యాయానికి గర్వకారణమైన మైలురాయిగా సీఎం పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన వైస్ ఛాన్సలర్లందరినీ సీఎం అభినందించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com