AP: దావోస్‌లో ఏపీ బ్రాండ్

AP: దావోస్‌లో ఏపీ బ్రాండ్
X
దిగ్గజ సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం చర్చలు...ఏపీలో పెట్టుబడులకు సంసిద్ధత

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఇండియా నుంచి పాల్గొంటున్న రాష్ట్రాలన్నీ పెట్టుబడుల కోసం పోటీ పడుతూనే పరస్పరం ప్రోత్సహించుకుంటున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమకు విభిన్నమైన రాజకీయ విధానాలు, ఆకాంక్షలు ఉన్నా ఒకటిగా కలిసి పని చేస్తామని చెప్పారు. ప్రపంచానికి భారతదేశం టెక్నాలజీని అందజేస్తుందని.. అది మా భారతీయుల సత్తా అని వ్యాఖ్యానించారు. ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను పెంచడం ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల ఆకర్షణ కోసం నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగిన చంద్రబాబు నాలుగు రోజుల దావోస్‌ పర్యటన గురువారంతో ముగిసింది. ప్రపంచ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆయన.. ప్రముఖ సంస్థల సీఈవోలు, అధిపతులు, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. వివిధ రంగాలకు చెందిన సుమారు 15 అత్యున్నత వాణిజ్య సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా గడిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అందుకు అనువైన పరిస్థితులను వివరించారు. నాలుగు రోజుల దావోస్‌ పర్యటన ముగించుకున్న చంద్రబాబు... ఢిల్లీ చేరుకున్నారు.

కీలక సమావేశాలు.. పెట్టుబడులు

ప్రఖ్యాత పర్యావరణవేత్త, చె హోల్డింగ్స్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆండ్రీ హాఫ్‌మన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. స్విస్‌మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ట్‌ ఫిస్టర్, స్విస్‌ టెక్స్‌టైల్స్‌ సీఈవోలతో సమావేశమయ్యారు. గ్రీన్‌ ఇండస్ట్రియలైజేషన్‌ అంశంపై ప్రసంగించారు. స్వర్ణాంధ్ర-2047 దార్శనికపత్రంలోని పది ప్రాధాన్యత అంశాల గురించి కీలకంగా ప్రస్తావించారు. మెర్సెక్‌ సంస్థ, డేటా సెంటర్లు, ఐవోటీ రంగాల్లో ప్రముఖ సంస్థ సిస్కో, దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీకెమ్, శీతల పానీయాల తయారీలో గ్లోబల్‌గా గుర్తింపు పొందిన కాల్స్‌బర్గ్‌ గ్రూప్, ఆర్సెలార్‌ మిత్తల్‌ గ్రూప్‌ సంస్థల ప్రతినిధులు, సీఈవోలతో సమావేశమై.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారిని ఆహ్వానించారు. గూగుల్‌ క్లౌడ్, మలేసియాకు చెందిన పెట్రోనాస్, పెప్సికో, హిందుస్థాన్‌ యునీలీవర్, సెంటర్‌ ఫర్‌ ఎనర్జీ అండ్‌ మెటీరియల్స్‌, ప్రతినిధులతో సమావేశమయ్యారు. మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకులు బిల్‌గేట్స్‌తో సమావేశమై.. ఆరోగ్యం, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేందుకు సహకరించాలని ఆయన్ను కోరారు.

నేడు కేంద్ర ఆర్థికమంత్రితో చంద్రబాబు భేటీ

సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో నేడు (శుక్రవారం) భేటీ కానున్నారు. ఆర్థికశాఖ కార్యాలయంలో సమావేశమవుతారు. ఫిబ్రవరి 1న కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను ఆమె ముందుంచనున్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది.

Tags

Next Story