పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని స్వాగతించిన ప్రతిపక్షాలు
పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ఎన్నికల నిర్వహణను టీడీపీ గతంలోనే స్వాగతించింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్పై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ప్రకటించారు. కాకపోతే, పాత నోటిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు 25 శాతం ఏకగ్రీవాలను అధికార పార్టీ దౌర్జన్యంతో దక్కించుకుందని బీజేపీ ఆరోపించింది. అఖిలపక్ష సమావేశంలోనూ కమిషనర్ నిమ్మగడ్డకు ఇదే విషయం చెప్పామని చెప్పుకొచ్చారు సోమువీర్రాజు.
అటు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్పై హౌస్ మోషన్కు సిద్ధమైంది ఏపీ ప్రభుత్వం. హైకోర్టుకు నేటి నుంచి సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేసింది. దీంతో న్యాయమూర్తి ఇంటి వద్దనే.. హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ జరగనుంది. కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను నిర్వహించలేమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు, కరోనా వ్యాక్సినేషన్కు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వ్యాక్సిన్ పంపిణీ పనిలోనే నిమగ్నమై ఉంటారని చెబుతోంది.
మరోవైపు ఎస్ఈసీ నోటిఫికేషన్ను ఏపీఎన్జీవో, ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఉద్యోగులు నిమగ్నమై ఉన్నారని, కరోనా ఉన్న సమయంలో ఎన్నికలు పెట్టి తమ ప్రాణాలను బలిపెట్టవద్దని కోరాయి. అయినా సరే ఎన్నికల కమిషనర్ ముందుకు వెళ్తామంటే మాత్రం ఎన్నికల విధులను బహిష్కరిస్తామంటూ తెగేసి చెప్పింది ఏపీఎన్జీవో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com