AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్.. ఏప్రిల్ 11న..

AP New Cabinet: ఏపీ మంత్రివర్గ విస్తరణకు సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్ చేశారని ప్రచారం జోరుగా సాగుతోంది. అన్నీ అనుకూలిస్తే ఏప్రిల్ 11న కొత్త మంత్రులు ప్రమాణం చేస్తారని సమాచారం. ఆ రోజు అన్ని విధాలుగా తిధులు ఇతర ఘడియలు బాగున్నాయని అంటున్నారు. ఇక బడ్జెట్ సెషన్ కూడా ముగియడంతో జగన్ మంత్రి వర్గం కూర్పు మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారని తెలుస్తోంది.
కొత్త మంత్రుల ఎంపిక విషయంలో ఏ విధమైన పొరపాట్లూ లేకుండా రాజకీయంగా, ప్రాంతీయంగా, సామాజికవర్గ పరంగా కూడా పూర్తి స్థాయిలో ఒకటికి పదిసార్లు సమీక్షించుకుని మరీ కొత్త మంత్రులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. ఇక కొత్త మంత్రులుగా ఎవరు ఉండాలన్నది సీఎం ఇష్టమే అయినా ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉండడంతో ముఖ్యమంత్రికి ఇది కత్తి మీద సాము వ్యవహారమే అని అంటున్నారు.
ఎవరికి పదవి ఇచ్చినా.. ఎవరిని తప్పించినా అది తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. దీంతో ఆచి తూచి సీఎం అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశావహులను ఆయన పిలిపించుకుని మాట్లాడి ఏ కారణంతో మంత్రి పదవులు ఇవ్వలేకపోతున్నామో తెలియచేస్తారని.. ఆ విధంగా చేయడం ద్వారా చాలా వరకు అసంతృప్తి రాకుండా ఉంటుందని ఆశిస్తున్నారు సీఎం.
ఫ్యూచర్లో మంచి అవకాశాలు ఇస్తామని కూడా సీఎం వారికి హామీ ఇస్తారని తెలుస్తోంది. అదే టైమ్లో మాజీలు అవుతున్న మంత్రులకు ఇంతకంటే పెద్ద బాధ్యతలుగా పార్టీని అప్పగించాలని జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మీరే రేపటి రోజున పార్టీకి సారధులు పార్టీని మళ్లీ గెలిపిస్తే మీ మంత్రి సీటు మీకే అని ఇప్పటికే వారికి జగన్ చెప్పేసినట్లు తెలుస్తోంది. ఎంతలా చెప్పినా ఎన్ని రకాలైన హామీలు ఇచ్చినా మంత్రివర్గ విస్తరణ అంటే అలకలు అసంతృప్తులు ఉండడం సహజం.
మరి జగన్ వాటిని ఏ విధంగా అధిగమిస్తారు అన్నదే అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఏప్రిల్ 11న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం అని దాదాపుగా వైసీపీలో ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగిపోతోంది. మరి కొత్త మంత్రులు ఎవరు అన్నదే చూడాల్సిందే. అయితే.. రేపు జరిగే విందు సమావేశంలో మంత్రులతో.. జగన్ తన మనోగతాన్ని చెప్పనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com