AP: సీఎం చంద్రబాబుతో పవన్ కీలక చర్చలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న భేటీగా ముఖ్యమంత్రి–ఉప ముఖ్యమంత్రి సమావేశం నిలిచింది. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా ‘హనుమాన్’ ప్రాజెక్ట్ను ప్రారంభించిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పవన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లి కీలక అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక శాఖల పనితీరు, నిధుల వినియోగం, భవిష్యత్ కార్యాచరణపై ఇద్దరు నేతలు విస్తృతంగా మాట్లాడుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై నేరుగా సమీక్షించాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగింది. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ భేటీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, అటవీ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నుంచి తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, వ్యవసాయ అవసరాలు, వన్యప్రాణి సంరక్షణ వరకు విస్తృత అంశాలు చర్చకు వచ్చాయి.
జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి శుద్ధి చేసిన తాగునీటిని అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న ఈ పథకంలో నిధుల వినియోగం ఎలా జరుగుతోందన్న దానిపై సమీక్షించారు. వివిధ నియోజకవర్గాల వారీగా కేటాయించిన నిధులు, పూర్తి చేసిన పనులు, పెండింగ్ ప్రాజెక్టులు వంటి అంశాలపై సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం. తాగునీటి సమస్యలున్న ప్రాంతాల్లో పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు తెలిసింది. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్ల అభివృద్ధి అంశం కూడా సమావేశంలో ప్రాధాన్యం పొందింది.
గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతులకు సంబంధించిన నిధుల కేటాయింపులపై నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిగింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు రహదారులే జీవనాడి అన్న అభిప్రాయంతో, అవసరమైన చోట అదనపు నిధులు సమకూర్చే విషయంపై చర్చించారు. అభివృద్ధి పనుల్లో పారదర్శకత, సమయపాలన పాటించాలని ఇద్దరు నేతలు భావించినట్లు తెలుస్తోంది.
పంచాయతీల్లో చేపట్టిన ‘మ్యాజిక్ డ్రెయిన్స్’ పనుల గురించి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను శాస్త్రీయంగా అమలు చేయడానికి ఈ తరహా డ్రెయినేజ్ వ్యవస్థ ఎంతో ఉపయోగకరమని ఆయన వివరించినట్లు సమాచారం. చెత్త, మురుగునీరు నిల్వ కాకుండా సమర్థవంతంగా పారుదల కావడానికి మ్యాజిక్ డ్రెయిన్స్ సహాయపడతాయని పేర్కొన్నారు. అన్ని పంచాయతీల్లో ఈ నమూనాను అమలు చేస్తే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
