AP Power Cut: ఏపీలో పెరిగిన కరెంటు కోతలు..

AP Power Cut: ఏపీలో పెరిగిన కరెంటు కోతలు..
AP Power Cut: ఏపీలో కరెంట్‌ కోతలు పెరిగిపోతున్నాయి. గత రెండ్రోజుల నుంచే విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి.

AP Power Cut: ఏపీలో కరెంట్‌ కోతలు పెరిగిపోతున్నాయి. గత రెండ్రోజుల నుంచే విద్యుత్‌ కోతలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్టీపీసీకి ...ఏపీ డిస్కంలు 350 కోట్ల రూపాయలు బకాయి పడ్డాయి. ఈ బకాయిలు చెల్లించాలని ఎన్టీపీసీ అధికారులు.. గత రెండు నెలలుగా ఏపీ డిస్కంలకు లేఖలు రాస్తున్నారు. కానీ ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్టీపీసీ నుంచి రావాల్సిన 800 మెగావాట్ల విద్యుత్‌ను నిలిపేశారు.

అంతేకాదు.. ఈ బకాయిల అంశం పరిష్కారించేంతవరకు బహిరంగ మార్కెట్‌లో కొనేందుకూ ఏపీ విద్యుత్‌ సంస్థలకు అవకాశం లేకుండా బ్లాక్‌ చేశారు. ఫలితంగా డిస్కంలు రెండ్రోజులగా పవర్‌ కట్‌ చేశాయి. ఎన్టీపీసీకి చెందిన విశాఖ సింహాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి 800 మెగావాట్ల కరెంట్‌ను ఏపీ డిస్కంలు తీసుకుంటున్నాయి. ఈ సంస్థకు రూ.350 కోట్లను బకాయి పడ్డాయి.

కనీసం రూ.30 కోట్లు చెల్లించాలని అడిగినా, డిస్కంలు అదీ కూడా చెల్లించలేదు. ఎన్టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి గురువారం నుంచి నిలిచిపోయింది. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లించనందున బహిరంగ మార్కెట్‌ కొనుగోలుకు అవకాశం లేదు. దీంతో గురువారమే 3వేల మెగావాట్ల కొరత ఏర్పడింది. దీని సర్దుబాటుకు జెన్‌కో థర్మల్‌ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి పెంచాలని ఉత్తర్వులు జారీ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నిన్నటి నుంచి.. హిందుజా పవర్‌ కార్పొరేషన్‌తో కుదుర్చుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం డిస్కంలు కరెంట్‌ తీసుకోవాల్సి వచ్చింది. నిన్న మధ్యాహ్నానికి 500 మెగావాట్లు అక్కడి నుంచి అందుబాటులోకి వచ్చింది. మరో 500 మెగావాట్లను రాత్రికి తీసుకోవడంతో సర్దుబాటు చేయటానికి ఆస్కారం ఏర్పడింది. అయితే రాష్ట్రంలో నిన్న కూడా కరెంట్‌ కోతలు తప్పలేదు. పీక్‌ డిమాండ్‌ సమయంలో వంతుల వారీగా గ్రామీణ ప్రాంతాల్లో 2-3 గంటల పాటు కోతలు విధించాయి.

థర్మల్‌ యూనిట్ల నుంచి ఉత్పత్తి పెంచాలంటే కనీసం 6 టైం బ్లాక్‌లు అంటే 15 నిమిషాలు ముందుగా చెప్పాలి. వెంటనే ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో జెన్‌కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్‌ల బాయిలర్లలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఈ రెండింటి నుంచి కలిపి రోజుకు 1300 మెగావాట్ల విద్యుత్‌ వస్తుంది. వీటిని ఇవాళ ఉదయం నుంచి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జెన్‌కో అధికారులు తెలిపారు.

ఉత్పత్తిని కొనసాగించాలన్నా థర్మల్‌ప్లాంట్ల దగ్గర బొగ్గునిల్వలు లేవు. ప్రస్తుతం వీటీపీఎస్‌ దగ్గర లక్షా 60 వేల టన్నులు, కృష్ణపట్నంలో లక్షా 60 వేల టన్నులు, కడప ఆర్‌టీపీపీలో 65 వేల టన్నుల బొగ్గే ఉంది. థర్మల్‌యూనిట్లు పూర్తి స్థాయిలో పనిచేయడానికి రోజుకు 65వేల టన్నుల బొగ్గు కావాలి. ప్రస్తుత నిల్వలు రెండుమూడు రోజులకే సరిపోతాయి.

Tags

Read MoreRead Less
Next Story