AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. పవర్ హాలీడే అమలు..

AP Power Holiday: ఏపీలో పరిశ్రమలకు షాక్ ఇచ్చింది జగన్ సర్కార్. గురువారం అర్ధరాత్రి నుంచి పవర్ హాలీడే ప్రకటించింది. పరిశ్రమలు వీకెండ్ సెలవుకు తోడుగా..మరో రోజు అదనంగా సెలవు ప్రకటించుకోవాలని సూచించింది. 24 గంటలు పని చేసే పరిశ్రమలు కూడా ...50 శాతం మాత్రమే కరెంట్ వినియోగించుకోవాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఈ గడ్డు పరిస్థితి 8 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
అటు, ఈ నిర్ణయం రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపనుంది. ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ 2014 ముందు పరిస్థితులు ఏర్పడతాయని పారిశ్రామికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల ఉపాధి అవకాశాలను సైతం ఈ నిర్ణయం తీవ్రంగా దెబ్బతీయనుంది. కొత్త పరిశ్రమలు రాక...ఉన్న పరిశ్రమలు 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని చెప్పడంతో కార్మికుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారనుంది.
కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకున్న టైంలో పవర్ హాలీడే ప్రకటించడంతో పరిశ్రమల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రో కంపెనీలపై పవర్ హాలిడే ప్రకటన తీవ్రమైన ఎఫెక్ట్ చూపనుంది. అచ్యుతాపురం సెజ్లో మూడు ఫెర్రో కంపెనీలు ఉండగా....అసియాలోనే అతిపెద్ద ఫెర్రో ఇండస్ట్రీ అయిన అభిజీత్ ఉత్పత్తులను కొనసాగిస్తోంది.
దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా 54 ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్తు అవసరం అధికంగా ఉంటుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని 180 పరిశ్రమలతో పాటు, పరవాడ ఫార్మాసిటీలోని 45 పరిశ్రమలపై పవర్హాలిడే ఎఫెక్ట్ పడనుంది. ప్రత్యక్షంగా కంపెనీల్లో పనిచేసే కార్మికులు, పరోక్షంగా అనుబంధ విభాగాలపైనా పడనుంది. ఇప్పటికే కొవిడ్తో రెండేళ్లగా ఉత్పత్తులు నిలిచిపోయి తీవ్రంగా నష్టపోయామని పరిశ్రమ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఓ వైపు పెరిగిన డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలతో ఆందోళన చెందుతున్న పరిశ్రమలపై...పవర్ హాలీడే ప్రకటన పిడుగు పడినట్లయింది. సదరన్ రీజియన్ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 253 పరిశ్రమలు తమ రోజువారీ విద్యుత్తు వినియోగంలో 50 శాతం మాత్రమే వినియోగించుకోవాల్సి ఉంటుంది. 1,696 ఇతర పరిశ్రమలకు ప్రస్తుతం అమల్లో ఉన్న వారాంతపు సెలవుకు అదనంగా ఒకరోజు పవర్ హాలిడే అమలు చేయనున్నారు.
SPDCL పరిధిలో చిత్తూరు జిల్లాలోని పరిశ్రమలకు ఇవాళ పవర్ హాలిడే అమలు చేస్తున్నారు. పుత్తూరు మినహాయించి మిగిలిన అన్ని డివిజన్లలోనూ ఈ నిర్ణయం అమలవుతోంది. ఏపీలో రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల పవర్ షార్టెజ్ ఏర్పడిందన్నారు ట్రాన్స్ కో సీఎండీ శ్రీధర్. దేశవ్యాప్తంగా సరిపడా విద్యుత్తు అందుబాటులో లేకపోవడంతో...రాష్ట్ర అవసరాలకు తగినంత కొనలేకపోతున్నామన్నారు.
దేశవ్యాప్తంగా పంటల ముగింపు కాలం, వడగాలుల కారణంగా ఎక్స్ఛేంజీలోనూ విద్యుత్తు అందుబాటులో లేదని స్పష్టం చేశారు. పంట కోతలు ముగిసిన తర్వాత వచ్చే 15 రోజుల్లో డిమాండ్ తగ్గే అవకాశం ఉందన్నారు. గృహ, వ్యవసాయ అవసరాలకు ఆటంకం లేకుండా చూసేందుకు పరిశ్రమలకు సరఫరాను నియంత్రించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
పరిశ్రమలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, వ్యాపార సంస్థలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించింది జగన్ సర్కార్. ఏసీల వినియోగాన్ని తగ్గించుకోవాలని తెలిపింది. వ్యాపార ప్రకటనల హోర్డింగులు, సైన్బోర్డులకు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు విద్యుత్తు ఉపయోగించకూడదని ఆదేశాలిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com