AP: ఏపీలో ఆర్టీఐ పరిధిలోకి ఆలయాలు, మసీదులు, చర్చిలు

ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలు, మసీదులు, చర్చిలకు సంబంధించిన సమాచార పారదర్శకత అంశంపై కీలకమైన స్పష్టత వెలువడింది. ప్రభుత్వ సహకారం లేదా ప్రభుత్వ పర్యవేక్షణలో నడిచే మత సంస్థలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయా లేదా అన్న చర్చ చాలాకాలంగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ తాజాగా దీనిపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ నిధులు, గౌరవ వేతనాలు లేదా ప్రభుత్వ వ్యవస్థల ఆధ్వర్యంలో నిర్వహణ పొందుతున్న మత సంస్థలు ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉండాలని, అలాంటి సంస్థలు సమాచార హక్కు చట్టం కింద సమాచారాన్ని అందించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయని పేర్కొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) వజ్జా శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నిర్వహించబడుతున్న ఆలయాలు, మసీదులు, చర్చిలు సమాచార హక్కు చట్టం-2005 పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ సంస్థల నుంచి ఎవరైనా పౌరులు సమాచారం కోరితే సంబంధిత అధికారులు తప్పనిసరిగా సమాధానం ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు. ప్రజల డబ్బు లేదా ప్రభుత్వ సహకారం అందుతున్న సంస్థలు ప్రజలకు జవాబుదారులుగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
మినహాయింపులు ఇచ్చిన కమిషన్
అయితే ఈ నిర్ణయంలో కొన్ని అంశాలకు మినహాయింపులు కూడా ఉన్నాయని కమిషన్ స్పష్టత ఇచ్చింది. మత విశ్వాసాలు, వ్యక్తిగత ఆచారాలు, ప్రత్యేక పూజా విధానాలు, మతపరమైన వేడుకలు వంటి అంతర్గత మత సంబంధిత అంశాలు మాత్రం సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని పేర్కొంది. అంటే పరిపాలన, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు వంటి అంశాలపై సమాచారం కోరవచ్చుగానీ, వ్యక్తిగత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై ఆర్టీఐ వర్తించదని వివరించింది. వన ఈ నిర్ణయానికి కారణమైన కేసు కూడా ఆసక్తికరంగా మారింది. విశాఖపట్నంలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి సంబంధించిన కొన్ని వివరాలను పట్నాయక్ అనే వ్యక్తి 2013లో సమాచార హక్కు చట్టం కింద కోరారు. ఆలయంలో జరిగే పండుగలు, వాటి నిర్వహణ, ఇతర పరిపాలన అంశాలకు సంబంధించిన సమాచారం కావాలని ఆయన అభ్యర్థించారు. ఈ క్రమంలో ఆర్టీఐ చట్టం ప్రకారం మొత్తం 21 దరఖాస్తులు సమర్పించినట్లు ఆయన తెలిపారు. తాను కోరిన సమాచారం ఇవ్వకుండా ఆలయ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (పీఐవో) తన దరఖాస్తులను తిరస్కరించారని పట్నాయక్ ఆరోపించారు. తన అభ్యర్థనలను ఎందుకు తిరస్కరించారనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేయలేదని, ఆర్టీఐ చట్టంలోని ఏ నిబంధన కింద నిరాకరించారో కూడా పేర్కొనలేదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన రాష్ట్ర ప్రధాన సమాచార కమిషన్ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుపై సీఐసీ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా ఫిర్యాదు దారుడు పట్నాయక్తో పాటు ఆలయ డిప్యూటీ కమిషనర్ కూడా హాజరై తమ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారుల తరఫున డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ, 2018లో హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం ఆలయాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావని తమకు అవగాహన ఉందని తెలిపారు. అదే కారణంతో సమాచారాన్ని అందించలేదని వివరించారు..
హైకోర్టు నుంచి కొత్త ఉత్తర్వులు వచ్చే వరకు తాము ఈ విషయంలో ముందుకు వెళ్లలేమని కూడా ఆయన తెలిపారు. అయితే ఈ అంశాన్ని సీఐసీ సమగ్రంగా పరిశీలించింది. ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులు ఇలాంటి అంశాలపై ఇచ్చిన తీర్పులను కూడా పరిశీలించి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆధీనంలో లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న మత సంస్థలు ప్రజా సంస్థలుగా పరిగణించబడతాయని కమిషన్ అభిప్రాయపడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
