పింగళి వెంకయ్యకు భారతరత్న ఇచ్చి గౌరవించాలి : చంద్రబాబు
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని టీడీపీ అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దేశానికి జాతీయ పతాకాన్ని అందించిన పింగళి వెంకయ్య మన తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు చంద్రబాబు. పింగళి వెంకయ్య వ్యవసాయ, భూగర్భ పరిశోధనల్లో ఎంతో కృషి చేశారని అన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఖనిజ పరిశోధన శాఖ సలహాదారుగా సేవలందించారని గుర్తు చేశారు. దేశ ఔన్నత్యాన్ని, జాతీయ పతాక గొప్పతనాన్ని ప్రతి పౌరుడు విధిగా గౌరవించాలన్నారు.. వినువీధిలో ఎగిరిన భారత కీర్తి పతాకం మన జాతీయ జెండాకు నేటితో వందేళ్లు పూర్తయ్యాయని చంద్రబాబు చెప్పారు. మువ్వెన్నల జెండా అంటే యావత్ భారత దేశ సంస్కృతికి నదర్శనమన్నారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. త్రివర్ణంలో త్యాగం, శాంతి, ప్రగతి అనే మూడు ప్రతీకలను తన సిగలో అలంకరించుకుందన్నారు. మధ్యనున్న అశోక చక్రం ధర్మానికి సూచికగా నిలిచిందన్నారు చంద్రబాబు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com