Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ మరో షాక్

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ మరో షాక్
X
Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ మరో షాక్ ఇచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పుడప్పుడే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.

Andhra Pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్‌ మరో షాక్ ఇచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పుడప్పుడే ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. ఒక్కొక్కరికీ ఉద్యోగ విరమణ సమయంలోనే చెల్లిస్తామని స్పష్టం చేసింది. జగన్ ప్రభుత్వం ఇచ్చిన షాక్‌కి ఒక్కో ఉద్యోగి ఏకంగా లక్షన్నర వరకు నష్టపోనున్నారు. పైగా ఇరవై, పాతికేళ్ల తరువాత గానీ పీఆర్సీ బకాయిలు ఉద్యోగుల చేతికి వచ్చే పరిస్థితి లేదు. పాతికేళ్ల తరువాత ఏ ప్రభుత్వం ఉంటుందో, అప్పుడేం నిర్ణయం తీసుకుంటారో ఎవరికేం తెలుసు అంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఒకవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను ఏమార్చి మోసం చేసే ఉద్దేశంలో ప్రభుత్వం ఉందని మండిపడుతున్నారు. నిన్న జరిగిన స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఉద్యోగ సంఘాలు మళ్లీ నిరాశతోనే తిరిగి రావాల్సి వచ్చింది.

చంద్రబాబు ప్రభుత్వంలో 10 నెలల పీఆర్‌సీ ఏరియర్స్‌ను ఒకేసారి పొందారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగుల ఫ్రావిడెండ్‌ ఖాతాల్లో ఏరియర్స్‌ను జమ చేశారు. దీనివల్ల ప్రతి ఉద్యోగి లక్షన్నర వరకు ప్రయోజనం పొందారు. ఒక్కో సీపీఎస్‌ ఉద్యోగికి గత ప్రభుత్వం లక్ష రూపాయల వరకు ఏరియర్స్‌ చెల్లించింది. కాని, జగన్ సర్కార్ మాత్రం బకాయిలను ఉద్యోగ విరమణ సమయంలోనే ఇస్తామని తేల్చి చెప్పింది. పైగా ప్రభుత్వం ఇచ్చిన జీవోల్లో పీఆర్‌సీ ఏరియర్స్‌ విడుదలపై స్పష్టత లేదని ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి తెలిపారు. మొత్తం 21 నెలల ఏరియర్స్‌ను ఉద్యోగి ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేయాల్సిందేనని ఏపీటీఎఫ్‌ కూడా డిమాండ్‌ చేసింది. ఇక పీఆర్సీని ఐదేళ్లకు తగ్గించినప్పటికీ.. జగన్ ప్రభుత్వంలో ఒక్కో ఉద్యోగి 42 నెలలు పీఆర్‌సీ ప్రయోజనాలు కోల్పోతున్నారు.

ఉద్యోగులకు రావలసిన 5 డీఏల బకాయిలపైనా ఊసెత్తలేదు ప్రభుత్వం. వాటిని ఎప్పుడు చెల్లిస్తారో జీవోలో ప్రస్తావించనేలేదు. అయితే, జీవో నెంబర్‌ వన్‌లో మాత్రం.. పీఆర్‌సీ బకాయిలు లెక్కించినప్పుడే డీఏ ఏరియర్స్‌ కూడా కలిపి లెక్కించామని ఉంది. అంటే ఉద్యోగి రిటైర్ అయ్యేటప్పుడు మాత్రమే డీఏ బకాయిలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. జగన్‌ అధికారంలోకి రాగానే డీఏ ఏరియర్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. రెండు డీఏలకు ప్రభుత్వం చెల్లించాల్సింది 8 వేల కోట్ల రూపాయలు కాగా.. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. ఆ రెండు డీఏ బకాయిలకే దిక్కులేనప్పుడు.. ఇప్పుడు ఐదు డీఏలను పీఆర్‌సీ బకాయిల్లో కలిపి లెక్కించారంటే ఎలా నమ్మాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

అసలు కరువు వచ్చింది ఇప్పుడైతే భత్యం రిటైర్మెంట్‌ సమయంలో చెల్లించడం ఏంటని నిలదీస్తున్నారు. డీఏ ఏరియర్స్‌ను జీపీఎఫ్‌ ఖాతాల్లో వేసి 8.5 శాతం వడ్డీ ఇవ్వాలంటున్నారు. అందులోనూ పీఆర్‌సీ బకాయిల్లోనే డీఏ ఏరియర్స్‌ కూడా ఉన్నాయనడానికి ప్రభుత్వం ఎలాంటి ఆధారం చూపడం లేదని.. ఒక్కో ఉద్యోగికి పీఆర్సీ ఏరియర్లు ఎంత రావాలో రాతపూర్వకంగా ఇస్తే అందులో డీఏ బకాయిలు కలిసి ఉన్నాయో లేవో అర్థమవుతుందని అంటున్నారు. మొత్తానికి తాజా పీఆర్సీ ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత ప్రమాదంలో పడిందని ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.

Tags

Next Story