AP Special Status: ఏపీ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం: కేంద్రం

AP Special Status: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం మళ్లీ పాత పాటే పాడింది. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మరోసారి పార్లమెంట్ వేదికగా తేల్చి చెప్పేసింది. లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు.. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో వైసీపీ చేతులెత్తేసిందని టీడీపీ విమర్శలు గుప్పించింది. ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న పోరాటం ఏంటో సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని టీడీపీ నేతలు నిలదీశారు.
లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిత్యానందరాయ్.. ప్రత్యేక హోదా సహా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదాకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. కేంద్రం పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతానికి ఆర్థిక సంఘం పెంచిందని స్పష్టంచేశారు. రెవెన్యూ లోటు రాష్ట్రాలకు అదనపు నిధులను 14వ ఆర్థిక సంఘం కేటాయించిందన్నారు.
15వ ఆర్థిక సంఘం కూడా ఈ సిఫారసులను కొనసాగించిందని గుర్తుచేశారు. విభజన చట్టంలోని హామీలను చాలా వరకు కేంద్రం నెరవేర్చినట్లు లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. కొన్ని అంశాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని.. వాటిని కూడా పదేళ్లలో పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి ఇప్పటికే కేంద్ర హోంశాఖ 28 సమావేశాలను ఏర్పాటు చేసిందని నిత్యానందరాయ్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com