Chandrababu : తూర్పు గోదావరిలో చంద్రబాబు పర్యటన

Chandrababu : తూర్పు గోదావరిలో చంద్రబాబు పర్యటన
X
బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 'ఇదేం కర్మ మన రాష్ట్రానికి' పేరుతో చంద్రబాబు మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో కొన్ని రోజులపాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు ఇకనుంచి రెగ్యులర్ గా ప్రజల్లో ఉండేందుకు పక్కా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు లోకేష్ పాదయాత్రతో తెలుగుదేశం పార్టీ ఫుల్‌ బిజీ అయిపోయింది.


ఒక నెల గ్యాప్‌తో టీడీపీ చీఫ్ చంద్రబాబు మళ్లీ ప్రజల్లోకి రాబోతున్నారు. డిసెంబర్ చివరి వారంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. తర్వాత సంక్రాంతి పండుగ కావడంతో విరామం ప్రకటించారు.. నారా లోకేష్ పాదయాత్ర నేపథ్యంలో చంద్రబాబు కొన్ని రోజులపాటు నియోజకవర్గాలపై దృష్టి పెట్టి సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు సమీక్షలు పూర్తి కావడంతో మళ్లీ ప్రజల్లోకి తిరిగి రాబోతున్నారు.


బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట- పెద్దాపురం -అనపర్తి నియోజకవర్గాల్లో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొంటారు. రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకుని.. అక్కడి నుంచి ముందుగా జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తారు. మరసటి రోజు పెద్దాపురం నియోజకవర్గంలో, మూడో రోజు అనపర్తి నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటనలు ఉండబోతున్నాయి.


పర్యటనలో రోడ్ షో తో పాటు బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నారు. మూడు రోజుల పాటు మూడు నియోజకవర్గాల్లో రోడ్ షోలు, మూడు సభలు జరుగుతాయి. చంద్రబాబు మూడు రోజుల టూర్‌ను సక్సెస్ చేసేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలంతా భారీ ఏర్పాట్లు చేశారు. యువత బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.

చంద్రబాబు మూడు రోజుల టూర్‌ను సక్సెస్ చేసేందుకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా పసుపు మయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా చంద్రబాబు కటౌట్లే కనిపిస్తున్నాయి. చంద్రబాబు పర్యటనకు సంబంధించి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నేతలు అంతా జిల్లా ఎస్పీకి అనుమతికి దరఖాస్తు కూడా చేశారు. అయితే ఇంతవరకు చంద్రబాబు టూర్ కు అనుమతిస్తున్నట్లు కానీ ఇవ్వడం లేదని కానీ పోలీసుల దగ్గర నుంచి సమాచారం రాలేదు.

జీవో 1ను బేస్ చేసుకుని ఇప్పటికే నారా లోకేష్ పాదయాత్రను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రోడ్లపై ఎక్కడ ప్రజలతో మాట్లాడనివ్వకుండా లోకేష్ వెంట ఉన్న ప్రచార రథాలను సీజ్ చేశారు. లోకేష్ మైకులను సైతం పోలీసులు లాగేసుకున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు టూర్ కూడా రోడ్లపైనే జరగనుంది. రోడ్ షోతో పాటు జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గంలోని ప్రధాన కూడళ్లలో చంద్రబాబు బహిరంగ సభలు ఉండనున్నాయి. చంద్రబాబు బహిరంగ సభలకు, రోడ్ షోలకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.

నారా లోకేష్ బహిరంగ సభలను రోడ్లమీద నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పోలీసులు ఇప్పుడు చంద్రబాబు విషయంలోనూ అదే చేస్తారా అని ఆలోచన అందరిలోనూ కనిపిస్తుంది. జీవో వన్ బేస్ చేసుకుని చంద్రబాబు పర్యటనలను అడ్డుకోవాలని పోలీసులు చూస్తే సహించేది లేదు అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ముఖ్యమంత్రి జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు లేని ఆంక్షలు టీడీపీకి పెడితే ఊరుకోబోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

అటు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నారా లోకేష్ పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతుంది. ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో చంద్రబాబు కూడా ఇక వరుస జిల్లాల పర్యటనలు చేయనున్నారు. చంద్రబాబు, లోకేష్ వరుస పర్యటనలతో టీడీపీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా తగ్గేదే లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.

Tags

Next Story